2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను ఏపీ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి రేపు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లే సమయం వుండటంతో సంక్షేమానికి జగన్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చే  అవకాశాలు కనిపిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (ap assembly budget session ) కొనసాగుతున్నాయి. రేపు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు కేబినెట్ (ap cabinet) అత్యవసర సమావేశం జరగనున్నట్లు సీఎస్ సమీర్ శర్మ (ap cs sameer sharma) ప్రకటించారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy ) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున దానికి ఆమోదం తెలిపేందుకు మంత్రిమండలి సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది

ఈసారి రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లకు పైగానే ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నవరత్నాల పేరుతో అమలు చేసే సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయింపులు జరిపే అవకాశముంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున సంక్షేమానికే పెద్దపేట వేయనున్నారు. వీటితో పాటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలే కాకుండా కొత్తవాటికి ఏమైనా కేటాయింపులు చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉన్నందున దానికి సంబంధించిన కేటాయింపులను కూడా పెంచాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ఎక్కువగా కొనసాగింపు ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 శాతం జీఎస్డీపీ వృద్ధి సాధించగా.. మూడేళ్ళుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. ఉద్యోగులకు సైతం ఒకేసారి 5 డీఏలు విడుదల చేయడం , 11 వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. 

అలాగే గతేడాది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కోవిడ్ పూర్వ స్థితికి చేరుకోవడంతో పాటు తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి 2,04,758 రూపాయలకు చేరింది. నవరత్నాల అమలు ద్వారా మానవ, ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలలో 13,500 ఆర్థిక సహాయం అందిస్తోంది జగన్ ప్రభుత్వం (ys jagan govt) . 

మంత్రి మండలి ఆమోదం తర్వాత ఉదయం 10.30కీ అసెంబ్లీ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మంత్రి కన్నబాబు బడ్జెట్ ప్రవేశ పెడతారు. మండలిలో మంత్రి అప్పలరాజు, మంత్రి పుష్పశ్రీ వాణీ ప్రవేశ పెడతారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ఎంత మంది లబ్ధిదారులకు న్యాయం జరిగిందో, రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో సభకు తెలియజేయనున్నారు.