ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజం ... టీడీపీ వల్లే ఈ స్థితి : ఏపీ ఆర్ధిక పరిస్థితిపై సర్కార్ వివరణ
టీడీపీ హయాంలో భారీగా అప్పులు చేశారని.. ప్రభుత్వాలు అప్పులు చేయడం సర్వసాధారణమైన విషయమని ఏపీ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి దువ్వూరి కృష్ణ తెలిపారు. విద్య, వైద్య రంగాలను గల పాలకులు నిర్లక్ష్యం చేశారని కృష్ణ అన్నారు
రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి కృష్ణ దువ్వూరి వివరణ ఇచ్చారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచే ఆర్ధిక సమస్యలున్నాయని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కృష్ణ దువ్వూరి ఆరోపించారు. టీడీపీ హయాంలో భారీగా అప్పులు చేశారని.. ప్రభుత్వాలు అప్పులు చేయడం సర్వసాధారణమైన విషయమని ఆయన తెలిపారు.
విద్య, వైద్య రంగాలను గల పాలకులు నిర్లక్ష్యం చేశారని కృష్ణ అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిగా వినియోగించి వుంటే.. ఇప్పుడు ఆర్ధిక భారం వచ్చేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఖర్చులు పెట్టడం వల్లనే ఎకనామి పెరిగిందని.. ఎఫ్ఆర్బీఎం ప్రకారం 3 శాతం నియంత్రణను కేంద్రం పెట్టుకుందని కృష్ణ తెలిపారు. కానీ కోవిడ్ కారణంగా అది జీడీపీలో కిందటి ఏడాది 11 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు.
రూ.21 లక్షల కోట్లలను కేంద్రం కోవిడ్ సమయంలో అప్పుగా తీసుకుందని కృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఖర్చు పెంచడం వల్లనే కరోనా విపత్తు నుంచి బయటపడగలిగామని ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవన అవసరాల కోసమే అప్పు చేశామని.. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని దువ్వూరి కృష్ణ కోరారు.