వినాయక మండపాలకు రుసుములు.. అంతా దుష్ప్రచారమే : ఏపీ సర్కార్ క్లారిటీ
రాష్ట్రంలో వినాయక చవితి మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించింది. ఈ మేరకు ఏపీ ఎండోమెంట్స్ కమీషనర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదని తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రుసుము వసూలు చేస్తోందన్న ఆరోపణలపై ఏపీ దేవాదాయ శాఖ స్పందించింది. రాష్ట్రంలో గణేష్ మండపాలు పెట్టుకోవడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయ శాఖ కమీషనర్ జవహర్లాల్ తెలిపారు. గణేశ్ మండపాల వద్ద రుసుం వసూలు చేస్తున్నారని దుష్ప్రచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలని జవహర్లాల్ స్పష్టం చేశారు. ఎవరైనా ఇందుకోసం రుసుములు వసూలు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు.. ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి హిందువులు పండుగలు జరుపుకోవాలా అని జేసీ ప్రశ్నించారు.
చవితి పందిళ్ల ఏర్పాటు కోసం ప్రజలు అధికారులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ విగ్రహాల ఏర్పాటుకు అనుమతించని వారికి నిద్ర లేకుండా చేయాలంటూ విఘ్నేశ్వరుడిని ఆయన ప్రార్ధించారు. మునిసిపల్ ఛైర్మన్గా వున్న తనకే విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం కష్టంగా వుందని.. అలాంటప్పుడు సామాన్యుల పరిస్ధితి ఏంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:వినాయక పందిళ్లపై సవాలక్ష రూల్స్ .. నీ దయాదక్షిణ్యాలపై ఆధారపడి పండగ చేసుకోవాలా : జగన్పై జేసీ ఫైర్
ఇకపోతే... వినాయక పందిరికి రోజుకు వెయ్యి రూపాయలు పన్ను కట్టమనటం హేయమైన చర్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి జరగకుండా చేసి పండుగ ప్రాసిస్త్యం తగ్గించేలా జగన్ రెడ్డి చర్యలున్నాయని మండిపడ్డారు. హిందూమతం మీద జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని బోండా ఉమా ఆరోపించారు. పండుగల మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు.
పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ రెడ్డి తుగ్లక్ పాలన ఉందన్నారు. వినాయక చవితి పండుగ సంప్రదాయాలకు తగ్గట్లు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు జరపాలనటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వైసీపీ ప్రభుత్వం దాడులుకు తెగబడుతోందని బోండా ఉమ విమర్శించారు. వినాయక చవితి పందరికి మాలిన నిబంధనలు పెట్టారని.. పండుగ జరగకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.