అర్చకుల ఆధీనంలోని భూములపై హక్కు దేవాదాయ శాఖదే : మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
అర్చకుల ఆధీనంలోని భూముల పర్యవేక్షణ బాధ్యత దేవాదాయ శాఖదేనన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ ఆధీనంలో 4.2 లక్షల ఎకరాల భూమి వుందని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (kottu satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. అర్చకుల ఆధీనంలోని భూముల పర్యవేక్షణ బాధ్యత దేవాదాయశాఖదేనని (ap endowments department) ఆయన స్పష్టం చేశారు. అయితే కేవలం భూముల ఫలసాయం మాత్రమే అర్చకులు అనుభవించవచ్చని సత్యనారాయణ పేర్కొన్నారు. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవాదాయ శాఖకు చెందుతాయని.. ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ ఆధీనంలో 4.2 లక్షల ఎకరాల భూమి వుందని మంత్రి వెల్లడించారు. అలాగే దేవాదాయ శాఖ భూముల్లో కొన్ని ఆక్రమణలో వున్నాయని.. వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
Also REad:ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలి: మంత్రి కొట్టు సత్యనారాయణ
మఠాలు, పీఠాల భూముల లీజు, పొడిగింపు తదితర వ్యవహారాలను ధార్మిక పరిషత్ చూసుకుంటోందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 3,500 ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నిధులు కోరాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలు వున్న ఆలయాలకు నైవేద్యం పథకం కింద నిధులు మంజూరు చేస్తామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇకపోతే.. ప్రస్తుతం తన శాఖలో ఉద్యోగుల కొరత వుందని.. నిబంధనలను అనుసరించి రెవెన్యూ శాఖ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కూల్చివేసిన 44 ఆలయాల్లో ఏడు దేవాలయాలను పున: నిర్మించామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.