ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ జీవోలను (PRC GOs) వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు తలపెట్టిన చలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ జీవోలను (PRC GOs) వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు తలపెట్టిన చలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజయవాడకు బయలు ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు పూర్తిగా నిర్బంధించారు. సభ వేదిక బీఆర్టీఎస్ రోడ్డు పరిసరాల్లో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అక్కడికి చేరుకుంటున్నవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు (BRTS road0 చుట్టుపక్కల అన్నివైపులా పికెట్లు ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడ నగరం పోలీసుల నిఘా నేత్రంలోకి వెళ్లిపోయింది. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఎలాగైనా చలో విజయవాడను జరిపి తీరుతామని చెబుతున్నారు.
రాష్ట్రంలోని విజయవాడ వైపు వస్తున్న బస్సులు, వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాత్రి నుంచి ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అనుమానం వచ్చిన వారిని వెంటనే వెనక్కి పంపుతున్నారు. చలో విజయవాడకు ఉద్యోగ నేతలు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీసుల తనిఖీలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటు చేసి చలో విజయవాడకు బయలుదేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు తమను అడ్డుకోవడంతో ఉద్యోగులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సులో వస్తున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు బస్సులోనే ఆందోళన చేస్తున్నారు. కర్నూలుకు చెందిన ఉద్యోగులు పెళ్లివారమండి బోర్డుతో బస్సులో విజయవాడకు బయలుదేరారు. అయితే వారి ప్లాన్ను పసిగట్టిన పోలీసులు గిద్దలూరు వద్ద అడ్డుకున్నారు. వారి వాహనాలను మార్గమధ్యలో నిలిపేశారు. మార్కాపురంలో చలో విజయవాడకు వెళ్తున్న 30 మంది ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు.
మారువేషాల్లో ఉద్యోగాలు..
ఉద్యోగ సంఘాల పిలపుమేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు బయలుదేరిన ఉద్యోగులను, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకోవడంతో కొందరు మారువేషాల్లో విజయవాడకు బయలుదేరారు. కొందరు పోలీసులు గుర్తించకుండా రైతులు, కూలీలుగా మారువేషంలో విజయవాడకు చేరుకున్నారు.
ఉద్యోగులకు సెలవులు రద్దు..
ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం రోజున అత్యవసరమైతే తప్ప ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసింది.