మనసు మార్చుకున్న ఉద్యోగ సంఘాలు.. సీపీఎస్పై ప్రభుత్వంతో భేటీకి హాజరయ్యేందుకు సుముఖత
సీపీఎస్పై ప్రభుత్వంతో సమావేశానికి సంబంధించి ఏపీ ఉద్యోగ సంఘాలు మనసు మార్చుకున్నాయి. ఈ మేరకు సీపీఎస్ సమావేశానికి హాజరుకావాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది.
సీపీఎస్ సమావేశానికి హాజరుకావాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. జీఏడీ నుంచి మరోసారి ఆహ్వానం అందడంతో సమావేశానికి వెళ్లకూడదన్న నిర్ణయాన్ని మార్చుకున్నారు ఈ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు. సీపీఎస్తో పాటు పెండింగ్ అంశాలపై చర్చించాల్సి వుందని మరోసారి ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది జీఏడీ.
అంతకుముందు ఓపీఎస్పై చర్చిస్తేనే తాము చర్చలకు వస్తామని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తాము సీపీఎస్ సమావేశానికి హాజరు కావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఓపీఎస్పై చర్చిస్తేనే తాము చర్చలకు వస్తామని గత భేటీలోనే చెప్పామని తెలిపారు. తమకు ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చమని తాము ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా తెలిపారు. ఇతర రాష్ట్రాలు ఓపీఎస్కు వెళ్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు సాధ్యం కాదని అంటోందని ప్రశ్నించారు. ప్రభుత్వం జీపీఎస్ను మాత్రమే ఇస్తామంటే తాము చేయగలిగిందేమి లేదని అన్నారు.
ALso REad:సీపీఎస్పై సమావేశానికి రాలేం.. ఏపీ ప్రభుత్వంతో చర్చలకు ఉద్యోగ సంఘాలు దూరం..
మరోవైపు... ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎస్ టి యూ , యూటిఎఫ్ నుంచి సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. మిగతా ఉద్యోగ సంఘాలు గైర్హాజరు కావడంతో సీపీఎస్తో పాటు పీఆర్సీ పెండింగ్ అంశాలనూ చర్చిస్తామని ప్రకటించింది మంత్రుల కమిటీ. ఉద్యోగ సంఘాలతో సమావేశం కోసం మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , అధికారులు రావత్, గుల్జార్ తదితరులు హాజరయ్యారు. అయితే ఓపీఎస్ అంశం మినహా మరే అంశంపై చర్చించేందుకు అవకాశం లేదని ప్రకటించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ. డిసెంబర్ 6 తేదీ నాటికి జీతాలు, పెన్షన్లు చెల్లించలేని ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేస్తుందనీ ఊహించలేమంటూ దుయ్యబట్టారు.