Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో స్కూళ్లు తెరుచుకునేది ఎప్పుడంటే...క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి

నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 

AP Education Minister Adimulapu Suresh Review Meeting on nadu nedu
Author
Amaravathi, First Published Jul 20, 2020, 9:15 PM IST

అమరావతి: నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకూ ఫర్నీచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని, ఆలోగా 7 నుంచి 10 తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. 

సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి నాడు–నేడు పథకంలో భాగంగా జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల ప్రగతిని సంబంధిత అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని ఆదేశించారు.  క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తుండాలన్నారు. 

ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా చేపడుతున్న పనులను అదే డిపార్టుమెంట్లకు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందాలతో పర్యవేక్షించేటట్లు చూడాలని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ను మంత్రి ఆదేశించారు. మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయల అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. తాగునీటి సరఫరాలో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసే ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పూర్తి స్థాయిలో సిమెంట్ పంపిణీ కాకపోవడంతో అభివృద్ధి పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంటోందని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. 17 కంపెనీల నుంచి 17 వేల టన్నులకు పైగా సిమెంట్ రావాల్సి ఉందన్నారు. 

విద్యా శాఖలో నాడు–నేడు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కావాల్సినన్ని నిధులు పుష్కలంగా ఉన్నాయని, సిమెంట్ పరిశ్రమలకు తక్షణమే బకాయిలు చెల్లంచాలని మంత్రి ఆదేశించారు. సిమెంట్ కంపెనీలకు విద్యా శాఖ ఎటువంటి బకాయిలూ లేవని, ఇతర శాఖలు బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాలల అభివృద్ధి పనులకు సంబంధిత కంపెనీలు సిమెంట్ సరఫరా పూర్తిస్థాయిలో చేయడం లేదని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ విషయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని మంత్రి తెలిపారు.  

read more  జగన్ మంత్రివర్గం నుండి ఇద్దరు మంత్రులు ఔట్...రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

పనులు కొసాగడానికి పేరెంట్స్ కమిటీలకు రివ్వాల్వింగ్ ఫండ్ తక్షణమే అందజేయాలని ఆదేశించారు. విశాఖ జిల్లాలోని గిడిజాల గ్రామంలోని పాఠశాలలో చేపట్టిన పనులపై మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు.  ఆగస్టు మొదటి వారానికి రాష్ట్రంలో గుర్తించిన 30 డెమో స్కూల్స్ లో నాడు–నేడు పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని మంత్రి సురేష్ ఆదేశించారు. దీనిలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకూ ఫర్నీచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్ పంపిణీ ప్రారంభించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. మిగిలిన పాఠశాలలకూ పనుల ప్రగతిని బట్టి మెటీరియల్స్ ను పంపిణీ చేయాలన్నారు. ఇందుకోసం డెలివరీ షెడ్యూల్స్ ను రూపొందించాలన్నారు. 

కొవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి పాఠశాలల పున: ప్రారంభించే అవకాశముందని మంత్రి తెలిపారు. ఆలోగా పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా 7 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసేలా చూడాలన్నారు. ముందుగా పాఠ్య పుస్తకాలు అందజేయడం వల్ల విద్యార్థులు వాటిని చదువుకునే అవకాశముందన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా నాడు-నేడు పథకంలో భాగంగా ఏయే పాఠశాలల్లో గ్రానైట్, టైల్స్, మార్బుల్స్ తో గ్రౌండ్ ఫ్లోర్ వేశారో వాటి వివరాలు అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రం వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ వరకూ విద్యా శాఖలో రూ.972.68 కోట్లు నాడు-నేడు పథకం కింద వెచ్చించినట్లు మంత్రికి అధికారులు వివరించారు. 13 జిల్లాల వారీగా పరిశీలిస్తే, విశాఖ జిల్లా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. 98.33 కోట్లు వెచ్చించి 51.76 శాతం మేర విశాఖలో నాడు-నేడు పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లాలో అత్యల్ప పనులు జరిగినట్లు మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.

పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి ప్రారంభించిన స్టూడెంట్ హెల్ప్ లైన్ కు విశేషమైన స్పందన లభిస్తున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. కొవిడ్ నేపథ్యంలో గత నెల 27 నుంచి  ప్రారంభమైన స్టూడెంట్ హెల్ప్ లైన్ ద్వారా 240 మంది ఉపాధ్యాయులు...విద్యార్థుల సందేహాలకు పరిష్కారం చూపుతున్నారన్నారు. 

మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్దపై విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందివ్వాలన్నారు. నాణ్యమైన విద్య,  జగనన్న గోరుముద్ద పథకం అమలుతీరుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారన్నారు. 

బ్రిడ్జి కోర్సుల నిర్వహణ, అభ్యాస మొబైల్ అప్లికేషన్, పాఠ్య పుస్తకాల ముద్రణ తదితర అంశాలపైనా సీఎం సమీక్షిస్తారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన అందించడమే కాకుండా రుచికరమైన భోజనం అందివ్వాలన్నది సీఎం లక్ష్యమన్నారు. ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పలువురు విద్యా, పంచాయితీ రాజ్ శాఖాధికారులు పాల్గొన్నారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios