నువ్వు కూడా మరొకరితో సహజీవనం చేయి... న్యాయం కోసం వస్తే.. పోలీసుల తీరు..
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళల పట్ల పోలీసుల తీరు అభ్యంతర కరంగా ఉంటోందని ఓ మహిళా ప్రతినిధి డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదు చేసింది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లాల పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళల పట్ల పోలీసుల తీరు అభ్యంతర కరంగా ఉంటోందని ఓ మహిళా ప్రతినిధి డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదు చేసింది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లాల పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్ లో విజయవాడకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రతినిధి బొల్లినేని కీర్తి మాట్లాడుతూ.. సమస్యతో పోలీసుల వద్దకు వస్తే దాన్ని మరింత పెంచుతున్నారని తెలిపారు.
‘‘తనను పట్టించుకోకుండా పొరుగు వీధిలో ఇంకొకరితో సహజీవనం చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఒక మహిళ ఠాణాకు వెళ్లి పోలీసులను కోరింది. నువ్వు కూడా మరొకరితో సహజీవనం చేయొచ్చుగా... అని పోలీసులు ఎగతాళిగా మాట్లాడారు. మరో మహిళ... భర్తతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించి సహాయం చేయాలని కోరగా, ‘ఇదేమైనా మీ పుట్టిల్లా’ అంటూ పోలీసులు ఎద్దేవా చేశారు’’... అని పోలీస్ బాస్ గౌతం సవాంగ్కు తెలిపారు.
ఈ సందర్భంగా కొందరు పోలీసుల తీరు గురించి కీర్తి డీజీపీకి వివరించారు. వ్యభిచారం అభియోగంపై అరెస్టు చేసి తీసుకొచ్చిన మహిళలను కొన్నిచోట్ల కొడుతున్నారని, వారిని బాధితులుగానే చూడాలని చట్టం చెబుతోన్న విషయం సిబ్బందికి తెలియచేయాలని డీజీపీని కోరారు.
ఆమె చెప్పిన విషయాలను గౌతం సవాంగ్ సావధానంగా విన్నారు. మరోసారి తెలుగులో ఆమెతోనే చెప్పించి... వాటిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్ల అధికారులకు వినిపించారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. బాధిత మహిళలకు పోలీసుస్టేషన్ అండగా నిలిచే పుట్టిల్లేనని స్పష్టం చేశారు. ఏ ఇబ్బంది వచ్చినా పోలీసుస్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ సంప్రదించవచ్చని బాధితులకు సూచించారు.