పోలీసులు గంజాయి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని రాజకీయ నాయకులు అనడం సరికాదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హితవు పలికారు. సరైన సమాచారం విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని, ఇది చాలా బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు (andhra odisha border) ప్రాంతాల్లోని గ్రామాల్లో దశాబ్దాలుగా గంజాయి (ganjai) అక్రమసాగు కొనసాగుతుందన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ (ap dgp gowtham sawang) . శనివారం విశాఖలో పర్యటించిన ఆయన .. మీడియాతో మాట్లాడుతూ పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని డీజీపీ తెలిపారు. గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారని.. అనేక రకాల మార్గాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని గౌతం సవాంగ్ పేర్కొన్నారు.
మావోయిస్టులు (maoists) గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారని.. దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒడిశాలోని 23 జిల్లాల్లో, విశాఖ ఏజెన్సీలో (visakha agency) 11 మండలాల్లో గంజాయి సాగు అవుతోందని డీజీపీ పేర్కొన్నారు. ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేశామని గౌతం సవాంగ్ చెప్పారు. గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేశారని.. గంజాయి నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎర్పాటు చేశామని డీజీపీ వెల్లడించారు.
ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా విశాఖ లో గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 47,987 కిలోల గంజాయి స్వాదినం చేసుకున్నామని.. 46.41 లీటర్లు హషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు గౌతం సవాంగ్ పేర్కొన్నారు. 314 వాహనాలు సీజ్ చేసామని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 154 మంది స్మగ్లర్లతో పాటు కొత్తగా 300 పైగా కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచామని డీజీపీ చెప్పారు. నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేశామని.. ఇక్కడ పట్టుబడిన 2 లక్షల కేజీల గంజాయి తగులబెట్టామని తెలిపారు.
ఏజెన్సీలో నక్సల్ ప్రభావం తగ్గిపోతుందని.. ఏజెన్సీలో మార్పు మొదలైందని డీజీపీ చెప్పారు. గిరిజనుల గంజాయి సాగు వైపు వెళ్లకుండా 1963 అవగాహన కార్యక్రమాలు 93 ర్యాలీలు నిర్వహించామని గౌతం సవాంగ్ వెల్లడించారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చేస్తామని.. గంజాయి ఇప్పుడు హషిష్ ఆయిల్ రూపంలో కొత్త రూపం తీసుకుందని డీజీపీ తెలిపారు. దాని మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నామని.. పోలీసులు గంజాయి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని రాజకీయ నాయకులు అనడం సరికాదని హితవు పలికారు. సరైన సమాచారం విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని, ఇది చాలా బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
