జంగారెడ్డిగూడెం మరణాలపై ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సోమవారం నాడు ప్రకటన చేశారు. సహజ మరణాలను కూడా టీడీపీ నేతలు రాజకీయాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన మండి పడ్డారు. 

అమరావతి: జంగారెడ్డిగూడెం ఘటనపై విచారణకు ఆదేశించినట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం మంత్రి Alla Nani చెప్పారు.నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించామన్నారు.

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని జంగారెడ్డి గూడెం ఘటనపై ప్రకటన చేశారు. జంగారెడ్డిగూడెం ఘటనపై వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జంగారెడ్డిగూడెం ఘటనపై సీఎం ఆదేశం మేరకు తాను, కలెక్టర్ క్షేత్ర స్థాయికి వెళ్లినట్టుగా మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంత్రి ప్రకటన చేసే సమయంలో కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

Jangareddy Gudemలో సహజ మరణాలను కూడా మిస్టరీ మరణాలుగా మార్చారని ఆళ్ల నాని విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో ఈ పరిస్థితి రావడానికి Chandrababu సహా ఆ పార్టీ నేతలే కారణమన్నారు. 

జగన్ పై బురద చల్లేందుకు శవ రాజకీయాలకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. జంగారెడ్డిగూడెంలో 18 మరణాలు జరిగాయని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నాని చెప్పారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఓ వర్గం మీడియా కూడా ఈ ప్రచారానికి ఊతం ఇస్తున్నాయని ఆళ్ల నాని మండిపడ్డారు. నాటుసారా, కల్తీసారా తాగడం వల్లే చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ సభ్యులపై ఏపీ డిప్యూటీ సీఎం చెప్పారు.

 జంగారెడ్డిగూడెంలో ఉపేంద్ర అనే వ్యక్తి గుండెనొప్పితో చనిపోతే మద్యం వల్లే చనిపోయాడని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఉపేంద్రకు సంబంధించిన ఈసీజీ రిపోర్టు ఆసుపత్రిలో ఉందని ఆళ్ల నాని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా వాస్తవాలు తెలుస్తాయని మంత్రి చెప్పారు. మద్యం తాగలేనది మృతుడి భార్య స్వయంగా చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

జంగారెడ్డిగూడెంలో 16 మందిలో 15 మంది ఇంటి వద్దే చనిపోయారని మంత్రి వివరించారు. టీడీపీ నేతలే ఈ మరణాలను వక్రీకరిస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలపై టీడీపీకి ప్రేమ లేదన్నారు. రాజకీయాలపైనే టీడీపీకి ప్రేమ ఉందని ఆయన మండిపడ్డారు. టీడీపీ హాయంలో మద్యం ఏరులై పారిందన్నారు. ఈ విషయమై పాదయాత్రలో ప్రజల కష్టాలను గుర్తించిన సీఎం YS Jagan దశలవారీ మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చారని ఆళ్ల నాని గుర్తు చేశారు. 

జంగారెడ్డి గూడెం ఘటనలో మరణించిన వారిలో ఓ వ్యక్తి పది రోజుల నుండి మద్యం సేవిస్తూ సరిగా భోజనం కూడ చేయలేదని కుటుంబ సభ్యులే చెప్పారని మంత్రి నాని ప్రస్తావించారు.

ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్ల‌నే చనిపోయార‌నే ప్రచారం కూడా లేకపోలేదు. 

ఈ మరణాలపై ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌డానికి ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి విజ‌య‌వాడ జీజీహెచ్ డాక్ట‌ర్ల టీమ్ జంగారెడ్డి గూడెనికి చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్ల‌కు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి వివ‌రాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పారు. ఇందులో ప‌లువురు ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధప‌డుతున్న వారు కూడా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి కొంద‌రు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఉన్నర‌ని పేర్కొన్నారు. 

ఈ మ‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. గురువారం ఒక‌రు హాస్పిట్ ల‌కు వెళ్లిన కొంత స‌మ‌యానికి మృతి చెందారు. అయితే ఆయ‌న మృత‌దేహానికి పోస్టు మార్టం చేయ‌లేదు. ఇలా మృతి చెందిన వారెవ‌రికీ పోస్టు మార్టం నిర్వ‌హించ‌లేదు. దీంతో అస‌లు మ‌ర‌ణాలు ఏ కార‌ణంతో సంభ‌విస్తున్నాయ‌నే అంశంపై ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.