పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ భవిష్యత్తులో ఏం చేయనుందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది.


అమరావతి:పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సెలెక్ట్ కమిటీకి ఎన్ని రోజులపాటు కాల పరిమితిని శాసనమండలి ఛైర్మెన్ ప్రతిపాదిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సెలెక్ట్ కమిటీ ఎన్ని రోజుల్లో ఈ బిల్లుపై సవరణలను ప్రతిపాదించనుంది. ఈ బిల్లుపై నివేదికను సెలెక్ట్ కమిటీ శాసనమండలిలో ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత శాసనమండలి చర్చించి తిరిగి అసెంబ్లీకి పంపనుంది.

Also read:సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు: జరిగేది ఇదీ...

ఈ తతంగం పూర్తయ్యేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.ఈ తరుణంలో ప్రభుత్వం ముందు ఓ అవకాశం ఉంది. సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకు ఆగకుండా ఉండాలంటే ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. 

ఆర్డినెన్స్ ను జారీ చేసేందుకు ముందు చట్టసభలను ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో ఆర్డినె్న్స్ జారీ చేయాలి.ఈ ఆర్డినెన్స్ ఆరు నెలలపాటు మాత్రమే అమల్లో ఉంటుంది.ఈ లోపుగా చట్ట సభల ఆమోదం పొందాలి. లేదా ఆర్డినెన్స్ ను గడువును పొడిగించే అవకాశం కూడ ప్రభుత్వానికి ఉంది. అయితే మండలిలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినందున ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం లేదంటున్నారు నిపుణులు.

అయితే ప్రభుత్వం కూడ ఈ ప్రక్రియకు చెక్ పెట్టాలంటే శాసనమండలిని రద్దు చేయాలని కోరే అవకాశం ఉంది. శాసనమండలిని రద్దు చేయడం అంతా సులభం కాదు. 

కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం కూడ ఏపీ ప్రభుత్వానికి అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి కేంద్రంలోని బీజేపీ శాసనమండలి రద్దు విషయంలో వైసీపీకి సహకరిస్తోందో లేదో అనేది సందేహాస్పదమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.