కాసేపట్లో గడప గడపకూపై ప్రారంభంకానున్న వర్క్షాప్.. తాడేపల్లికి చేరుకున్న మంత్రులు , ఎమ్మెల్యేలు
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్క్షాప్ ప్రారంభంకానుంది . మూడు , నాలుగు అంచెల విధానంలో ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ నివేదికలు తెప్పించినట్లుగా తెలుస్తోంది.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్క్షాప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు తాడేపల్లికి చేరుకున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించనున్నారు. ఇప్పటికే నివేదికలు జగన్ చేతికి అందినట్లుగా తెలుస్తోంది. దీనిపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా నివేదికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. మూడు , నాలుగు అంచెల విధానంలో ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ నివేదికలు తెప్పించినట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే... జూలై 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆగస్ట్ 4 నుంచి ప్రతి నియోజకవర్గంలో 50 మంది కార్యకర్తలతో భేటీ అవుతానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తానని సీఎం తెలిపారు. పార్టీ కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని.. ఎవరి బాధ్యతలను వారు పూర్తిగా నిర్వర్తించాలని జగన్ దిశానిర్దేశం చేశారు.
వారి సొంత నియోజకవర్గాలతో పాటు.. పార్టీ అప్పగించిన బాధ్యతలను కూడా చూసుకోవాలన్నారు. పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలని జగన్ పేర్కొన్నారు. నెలలో ఆరు సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సమర్ధంగా పనిచేస్తే మళ్లీ గెలవడం అసాధ్యం కాదని.. ప్రతి సచివాలయానికి త్వరలో రూ.20 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ చెప్పారు. జిల్లా, మండల, నగర కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బూత్ కమిటీ నుంచి ప్రతి కమిటీలోనూ మహిళలకు ప్రాధాన్యత వుండాలని జగన్ దిశానిర్దేశం చేశారు.