గడప గడపకూపై మరోసారి వర్క్షాప్.. 19న తాడేపల్లికి పిలుపు, జగన్ వద్దకు చేరిన ప్రోగ్రెస్ రిపోర్ట్
ఈ నెల 19న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సీఎం వద్దకు రిపోర్ట్ చేరినట్లుగా తెలుస్తోంది.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై దృష్టి పెట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . దీనిలో భాగంగా ఈ నెల 19న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మరోసారి వర్క్ షాప్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేలు, మంత్రులు , రీజనల్ కో ఆర్డినేటర్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో భేటీకానున్నారు. ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సీఎం జగన్ వద్దకు రిపోర్ట్ చేరినట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే... జూలై 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆగస్ట్ 4 నుంచి ప్రతి నియోజకవర్గంలో 50 మంది కార్యకర్తలతో భేటీ అవుతానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తానని సీఎం తెలిపారు. పార్టీ కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని.. ఎవరి బాధ్యతలను వారు పూర్తిగా నిర్వర్తించాలని జగన్ దిశానిర్దేశం చేశారు.
వారి సొంత నియోజకవర్గాలతో పాటు.. పార్టీ అప్పగించిన బాధ్యతలను కూడా చూసుకోవాలన్నారు. పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలని జగన్ పేర్కొన్నారు. నెలలో ఆరు సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సమర్ధంగా పనిచేస్తే మళ్లీ గెలవడం అసాధ్యం కాదని.. ప్రతి సచివాలయానికి త్వరలో రూ.20 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ చెప్పారు. జిల్లా, మండల, నగర కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బూత్ కమిటీ నుంచి ప్రతి కమిటీలోనూ మహిళలకు ప్రాధాన్యత వుండాలని జగన్ దిశానిర్దేశం చేశారు.