పెరుగుతున్న బాధితులు: రేపు ఏలూరుకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఏలూరుకు వెళ్లనున్నారు. అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన బాధితులను సీఎం పరామర్శించనున్నారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఏలూరుకు వెళ్లనున్నారు. అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన బాధితులను సీఎం పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఏలూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి వింత వ్యాధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
మరోవైపు ఏలూరులో మొత్తం బాధితుల సంఖ్య 300కు పెరిగింది. ఇప్పటి వరకు ఆసుపత్రి నుంచి 122 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళ్లిన రోగుల ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది వైద్య బృందం.
మెరుగైన వైద్యం కోసం పది మంది రోగుల్ని విజయవాడకు తరలించారు అధికారులు. లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గాలి, నీరు కలుషితం కాలేదని నిపుణులు తేల్చి చెప్పారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేశారు.
డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఏలూరులో చిన్నారులు అస్వస్థతకు గురికావడంపై గవర్నర్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో స్థానిక పరిస్థితులపై గవర్నర్ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.