రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్.. ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని, ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభించనున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖ నుంచి త్వరలోనే పాలన సాగిస్తానని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటి పర్యటన సందర్భంగా విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభించనున్నారు.
సోమవారం పది గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 10.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో మధురవాడ ఐటీ హిల్స్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్కు వెళ్లనున్నారు. 10.50 గంటల నుంచి 11.55వరకు అక్కడే జగన్ గడుపుతారు. తర్వాత జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను జగన్ ప్రారంభిస్తారు.
అనంతరం హెలికాఫ్టర్లో 12.05 గంటలకు అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, అధికారులతో మాట్లాడిన అనంతరం ఫార్మాసిటీలో యుగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి అచ్యుతాపురంలోని ఏపీఎస్ఈజెడ్కు చేరుకుని లారస్ ల్యాబ్ యూనిట్ 2ను ప్రారంభించనున్నారు. తర్వాత విశాఖ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు జగన్.