రేపు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జగన్.. నరసాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసాపురంలో జరిగే పలు అభివృద్ధి పనులకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు పలు పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. ఏపీ ఆక్వా యూనివర్సిటీ, బియ్యప్పుతిప్ప ఫిషింగ్ హార్బర్, ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్, నరసాపురం బస్టాండ్ పునరుద్దరణ పనులు, ఖజానా లెక్కల కార్యాలయ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నరసాపురం అగ్రికల్చరల్ కంపెనీ భూములను రైతులకు ఇవ్వనుండటంతో పలు కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.
సోమవారం ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ హెలికాఫ్టర్ ద్వారా ... 10.50కి నరసాపురం చేరుకుంటారు. 11.15 గంటల నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు నరసాపురం నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి 2 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.