2021–22 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
2021–22 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాలవారీగా, మౌలిక సదుపాయాల రూపేనా భారీ నష్టం ఏర్పడిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పట్ల ఆశగా చూస్తామని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని అధికారులు వెల్లడించారు.
పక్కనున్న తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో సమానస్థాయిలోకి రావడానికి అవసరమైన ప్రత్యేక దృష్టి కేంద్ర బడ్జెట్లో కనిపించలేదని అధికారులు తెలిపారు.
Also Read:ఏపీకి మొండిచేయి: కేంద్ర బడ్జెట్ మీద విజయసాయి రెడ్డి ధ్వజం
బడ్జెట్ సందర్భంగా వివిధ రంగాలకు, కార్యక్రమాలకూ చేసిన కేటాయింపులు అన్నిరాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ లేవని అధికారులు ముఖ్యమంత్రి జగన్కు వివరించారు.
పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గడం, ఆహారం, పెట్రోల్, ఫెర్టిలైజర్స్ సబ్సిడీలను కూడా తగ్గించిన విషయాన్ని అధికారులు సీఎంకు నివేదించారు.
కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులు గట్టి ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వశాఖలతో లైజనింగ్ చేసుకుని సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని జగన్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.
