రూ.16వేల కోట్లతో వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం... సీఎం జగన్ కీలక నిర్ణయం
వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ సంస్కరణల కోసం దాదాపు రూ.16,236 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతంపై చేపడుతున్న కీలక ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలని... పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
మల్టీపర్పస్ సెంటర్లు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాససింగ్, ఫిషింగ్ హార్బర్లు, బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. వీటన్నింటి కోసం దాదాపుగా రూ.16,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
''సెప్టెంబరులో ఆసరా ఇవ్వబోతున్నాం. ఇప్పటికే చేయూత కింద డబ్బులు ఇచ్చాం. ఈ డబ్బు మహిళల సుస్ధిర ఆర్ధికాభివృద్ధికి దోహదపడాలి. కోరుకున్న వారికి ఆవులు, గొర్రెలు పంపిణీ చేయాలి'' అని అధికారులకు సీఎం ఆదేశించారు.
''రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకే రైతు భరోసా కేంద్రాల వద్ద మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు(ఎంపీఎఫ్సీలు) చేయాలి. దీనిలో భాగంగా ఆర్బీకేల వద్ద 15 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ప్లాట్ఫాంలు, గోడౌన్లు, హార్టికల్చర్ మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటుచేయాలి. మార్కెట్ యార్డుల్లో నాడు–నేడు కింద పనులతో పాటు ఇ–మార్కెటింగ్ చేపట్టాలని... వీటన్నింటికోసం రూ.2930 కోట్లు ఖర్చు అవుతుంది'' అని అంచనా వేశారు.
read more రాయలసీమ లిఫ్ట్ను టీడీపీ అడ్డుకొంటుంది: సజ్జల రామకృష్ణారెడ్డి
''ఆర్బీకేల స్ధాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. నియోజకవర్గాల స్ధాయిలో ఫామ్ మెకనైజేషన్ (హైటెక్ హై వాల్యూ హబ్స్) ఏర్పాటు చేయాలి. తొలిదశలో 3250 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం... ఇదివరకే వీటిని ప్రారంభించాం. రెండో దశలో కింద సెప్టెంబరు నాటికి మరో 3250 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వీటిలో 500 హార్వెస్టర్లు, 85 హబ్స్ ఏర్పాటు కానున్నాయి. మూడో దశలో భాగంగా డిసెంబరు నాటికి 4250 కమ్యూనిటీ సెంటర్లు, 535 హార్వెస్టర్లు, 85 హబ్స్ ఏర్పాటు చేయనున్నాం. మొత్తంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, 1035 కంబైన్డ్ హార్వెస్టర్లు, 175 హబ్స్ ఏర్పాటు చేయనున్నాం. వీటికోసం దాదాపు రూ.2,134 కోట్లు ఖర్చు చేయనున్నాం'' అని తెలిపారు.
''కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల వల్ల రైతులకు అందుబాటులో పరికరాలు ఉంటాయి. కూలీల కొరత సమస్య తగ్గుతుంది. తక్కువ ఖర్చుకే అందుబాటులోకి వ్యవసాయ ఉపకరణాలు ఉంటాయి. వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంపై రైతుల్లో నైపుణ్యాలు పెంచాలి. ఐటీఐ, పాలిటెక్నికల్ ఎడ్యుకేషన్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టాలి. దీనివల్ల గ్రామస్ధాయిలో వ్యవసాయ యంత్ర పరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉంటాయి'' అని అధికారులను ఆదేశించారు సీఎం.
''ఏ యంత్ర పరికరం ఎంత అద్దెకు లభ్యమవుతుందన్న విషయాన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. ఈ విషయంలో రైతులతో ఏర్పడ్డ రైతుసలహామండలి అభిప్రాయలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంబంధిత పరికరాలున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను పెట్టాలి'' అని సీఎం ఆదేశించారు.
''రాష్ట్రంలో 33 చోట్ల సీడ్ కం మిల్లెట్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కొన్ని చోట్ల అవసరాన్నిబట్టి ఒకటికి మించి యూనిట్ల ఏర్పాటు చేయాలి. ఇప్పటికే యూనిట్ల ఏర్పాటుకు దాదాపు స్ధలాల గుర్తింపు పూర్తయ్యింది'' అని సీఎంకు వివరించారు అధికారులు.
సీఎంకు వివరాలు అందించిన అధికారులు