ఆదివారం వెలువడిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని అందుకోవడంపై సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. 

అమరావతి: ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా జగన్‌ సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్‌ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

గతంలో 81 శాతం పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 99 శాతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారని జగన్ తెలిపారు. ఇక ఇప్పుడు 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో వైసిపి మద్దతుదారులు గెలిపిచారని సీఎం జగన్‌ తెలిపారు. 

వీడియో

ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని.... అయినా ప్రజలు అవేవీ నమ్మకుండా వైసిపి ప్రభుత్వంపై విశ్వాసం వుంచారని జగన్ తెలిపారు.

read more సాధ్యమైనంత త్వరగా నన్ను దింపేయాలని...: ఈనాడు డైలీపై ధ్వజమెత్తిన జగన్

అంతకుముందు ''దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి'' అంటూ జగన్ ట్వీట్ చేశారు.