వైఎస్ఆర్ 12వ వర్ధంతి: ఇడుపులపాయలో వైఎస్ఆర్కి నివాళులర్పించిన వైఎస్ జగన్, షర్మిల
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన కుటుంబసభ్యులు గురువారం నాడు నివాళులర్పించారు. ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
కడప: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతిని పురస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.నిన్న సాయంత్రం అమరావతి నుండి వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొన్నారు. కడప నుండి హెలికాప్టర్ లో ఇదుపులపాయకు చేరుకొన్నారు. ఇడుపులపాయలోనే రాత్రి వైఎస్ జగన్ బస చేశారు.
ఇవాళ ఉదయం ఇడుపులపాయలో కుటుంబసభ్యులతో వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సహా వైఎస్ భారతి పలువురు నివాళులర్పించారు.
ఏపీ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.ఇవాళ హైద్రాబాద్ లో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంస్మరణ సభను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సుమారు 300 మందికి విజయమ్మ ఆహ్వానం పంపింది.
తండ్రి వర్ధంతిని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా ఆయనను స్మరించుకొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్, నాన్న భౌతికంగా దూరమై పన్నెండేళ్లైందన్నారు. నాన్న ఇప్పటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారన్నారు. తాను వేసే ప్రతి అడుగుల్లో, ఆలోచనల్లో నాన్న స్పూర్తి ముందుండి నడిపిస్తోందన్నారు.