ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం వైఎస్ జగన్ కలిశారు. వీరిద్దరి మధ్య గంటకుపైగా భేటీ జరిగింది. నూతన జిల్లాలలో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్‌కు ముఖ్యమంత్రి తెలిపారు 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (ap governor) బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) , సుప్రవ హరిచందన్ దంపతులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy), భారతి (ys bharathi) దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ , సిఎంల మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయ, సమాజిక అంశాలపై వీరిద్దరూ లోతుగా సమాలోచనలు జరిపారు. 

కొత్త జిల్లాల వ్యవస్ధతో పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందని సిఎం గవర్నర్ కు వివరించారు. నూతన జిల్లాలలో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి దంపతులు జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతీ రాణా టాటా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.