Cyclone Michaung : అప్రమత్తంగా వుండండి .. సహాయక చర్యల్లో ఏ లోటూ రావొద్దు : అధికారులకు జగన్ ఆదేశం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు . సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు సిద్ధంగా వుండాలని జగన్ ఆదేశించారు.
![ap cm ys jagan key orders to officials over Cyclone Michaung ksp ap cm ys jagan key orders to officials over Cyclone Michaung ksp](https://static-ai.asianetnews.com/images/01ghn4ha1hjg66tkbs64jd1vms/ys-jagan-jpg_363x203xt.jpg)
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేశారు. ‘‘మైచౌంగ్’’ తుఫాను ఈ నెల 4న నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వుండటంతో అధికారులంతా సన్నద్ధంగా వుండాలని జగన్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు సిద్ధంగా వుండాలని జగన్ ఆదేశించారు.
కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి తాగునీరు, ఆహారం, పాలు వంటివి అందుబాటులో వుంచుకోవాలని.. అలాగే వైద్య సేవలను కూడా అందజేపయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.
కాగా.. మైచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడు, ఏపీల్లో తుఫాను సైరన్ మోగుతోంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటికే చెన్నైలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రోడ్లు జలమయం కావడంతో రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాకులపై వరద పొటెత్తడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: Cyclone Michaung: తుఫాను సైరన్.. భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుఫాను కారణంగా డిసెంబర్ 3 నుంచి ఉత్తర తమిళనాడు తీరం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో వర్షాలు, గాలుల తీవ్రత పెరుగుతుందనీ, డిసెంబర్ 4 సాయంత్రానికి ఆ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా బలపడి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ సునంద తెలిపారు. వాయువ్య దిశలో కదులుతూ డిసెంబర్ 4 సాయంత్రానికి ఉత్తర తమిళనాడు తీరం, దక్షిణాంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉందనీ, అయితే డిసెంబర్ 3 నుంచి వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు.
అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ, దాని పరిసర ప్రాంతాలకు (బంగాళాఖాతం) సమీపంలో అల్పపీడనంగా మారింది. కాబట్టి రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత వచ్చే 24 గంటల్లో ఇది వాయుగుండంగా వాయువ్య దిశలో కదులుతూ ఉత్తర తమిళనాడు ఆంధ్ర తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని సునంద తెలిపారు.
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) రాబోయే తుఫాను కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సన్నద్ధతను సమీక్షించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరిలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 18 బృందాలను అందుబాటులో ఉంచింది. కోస్ట్ గార్డ్, ఆర్మీ, నేవీకి చెందిన రెస్క్యూ, రిలీఫ్ టీమ్స్ తో పాటు నౌకలు, విమానాలను సిద్ధంగా ఉంచారు.