Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రం ఆర్ధికంగా బాగుంది.. ఈ మాటంటే బాబుకే నచ్చదేమో, ఏపీ అప్పుల చిట్టా ఇదే : అసెంబ్లీలో జగన్

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి బాగానే వుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. జీడీపీ గ్రోత్ రేట్‌లో రాష్ట్రం దేశంలోనే ఆరో స్థానంలో వుందని .. వైసీపీ పాలనలో ఏడాదికి 12.73 శాతం చొప్పున మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. 

ap cm ys jagan key comments on state financial status in assembly
Author
First Published Sep 16, 2022, 3:25 PM IST

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వచ్చిన ముప్పేం లేదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శుక్రవారం అసెంబ్లీలో పెట్టుబడులు , పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా బాగోలేదని, అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తోందన్నారు. వీరందరికీ పవన్ కల్యాణ్ కూడా తోడుగా వుంటారని జగన్ ఎద్దేవా చేశారు. లేనిది సృష్టించడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఆర్ధికంగా రాష్ట్రం బాగుంది అని చెబితే... కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయనంటూ జగన్ వ్యాఖ్యానించారు. 

కోవిడ్ లాంటి సవాళ్లు ఎదురైనా , గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, దేశంలోని చాలా రాష్ట్రాల కంటే బాగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.4 శాతం నెరవేర్చామని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రం బాగున్నా..  చంద్రబాబు ఆయన బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోయిందని నమ్మించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో జీడీపీ పెరుగుదల గతంలో కంటే చాలా బాగుందని సీఎం అన్నారు. చంద్రబాబు హయాంలో 5.36 శాతంగా వున్న జీడీపీ గ్రోత్ రేట్.. వైసీపీ పాలనలో 6.89 శాతానికి పెరిగిందని జగన్ పేర్కొన్నారు. 

ALso REad:ఏపీ అసెంబ్లీ సమావేశాలు: 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

జీడీపీ గ్రోత్ రేట్‌లో రాష్ట్రం దేశంలోనే ఆరో స్థానంలో వుందని సీఎం వెల్లడించారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో గత మూడేళ్లుగా తొలి మూడు, నాలుగు స్థానాల్లోనే వున్నామని జగన్మోహన్ రెడ్డి వివరించారు. తాజాగా 2021-22లో రాష్ట్ర జీడీపీ గ్రోత్ రేట్ 11.43 శాతంగా వుందన్నారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో వుందని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 4.45 శాతంగా వుండేదని.. వైసీపీ పాలనలో అది 5 శాతానికి చేరిందని జగన్ వెల్లడించారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా.. వస్తువులకు డిమాండ్ తగ్గకుండా పథకాల ద్వారా పేదల్ని ఆదుకోవడమే రాష్ట్ర పురోగతికి కారణమని సీఎం వివరించారు. 

2014లో రాష్ట్రం అప్పు లక్షా 20 వేల కోట్లని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు దిగిపోయే సమయానికి ఏపీ అప్పు 2 లక్షల 69 వేల కోట్లని ముఖ్యమంత్రి తెలిపారు . చంద్రబాబు హయాంలో అప్పులు ఏకంగా 123.52 శాతం పెరిగాయని జగన్ వివరించారు. అంటే ఏడాదికి 17.45 శాతం చొప్పున అప్పులు పెరిగాయని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.3.82 లక్షల కోట్లని.. మూడేళ్లలో 41.83 శాతం పెరిగిందని జగన్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఏడాదికి 12.73 శాతం చొప్పున మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. 

2014 నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.14 వేల కోట్లు మాత్రమేనని.. ఇదే సమయంలో చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.59 వేల కోట్లకు పెరిగాయన్నారు. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 3 లక్షల 28 వేల 719 కోట్లని జగన్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో ఏకంగా 144 శాతం రుణాలు పెరిగాయన్నారు. గత మూడేళ్లలో రాష్ట్ర రుణం 52 శాతం పెరిగిందని.. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పులు దాదాపు రూ.5 లక్షల కోట్లని జగన్ చెప్పారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర రుణాల పెరుగుదల తక్కువగానే వుందని సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో 2018- 19 అసలు , వడ్డీ కలిపి రూ.28,886 కోట్ల రుణాలు చెల్లించారని ముఖ్యమంత్రి తెలిపారు. వైసీపీ పాలనలో 2021- 22లో అసలు, వడ్డీ కలిపి రూ.36 వేల కోట్ల రుణాలు చెల్లించామని జగన్ పేర్కొన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios