ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ సర్కార్: నంద్యాలలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీతో స్థానికంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
నంద్యాల: తమది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు ప్రారంభించారు. తిరుపతి నుండి నేరుగా సీఎం జగన్ ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు.
తమ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ది కోసం ఎంతో చేయూతను ఇస్తుందన్నారు. ఒక పరిశ్రమ రావడంతో ఎంతో అభివృద్ది వస్తుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం జగన్ చెప్పారు.కర్నూల్ జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దీంతో రైతులకు మంచి జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడ మెరుగయ్యే అవకాశం ఉందని సీఎం జగన్ చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుండి అన్ని రకాల ప్రొత్సాహకాలను అందిస్తున్నందునే పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
ఈ ఏదాది పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తీసుకుని ర్యాంకులు ఇచ్చిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రం తీసుకుంటున్న చర్యలతో పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నందునే ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో మూడో ఏటా కూడా ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
తమది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం జగన్ చెప్పారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తే ఎకరానికి రూ. 30 వేలు చెల్లించి ప్రభుత్వమే లీజుకు తీసుకుంటుందన్నారు. మూడేళ్లకోసారి 5 శాతం లీజును పెంచుతామన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులతో చర్చించాలని సీఎం జగన్ కోరారు. కనీసం రెండు వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలని సీఎం జగన్ సూచించారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని సీఎం జగన్ చెప్పారు.
అంతకుముందు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పోర్టులు, నేషనల్ హైవేలు, సముద్ర తీర ప్రాంతాల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలను తీసుకున్నట్టుగా మంత్రి అమర్ నాథ్ వివరించారు.