Asianet News TeluguAsianet News Telugu

పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు జగన్ సర్కార్ తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాధి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మరో శుభవార్త ప్రకటించింది జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు అధికంగా వుండటంతో, వాటిని తగ్గించాలంటూ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది

AP CM YS Jagan Good News to Dwakra Womens
Author
Amaravathi, First Published Jun 5, 2020, 4:40 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాధి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మరో శుభవార్త ప్రకటించింది జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు అధికంగా వుండటంతో, వాటిని తగ్గించాలంటూ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది.

స్వయం సహాయక సంఘాల నుంచి వసూలు చేస్తున్న వడ్డీరేట్లను తగ్గించేందుకు పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి. దాని ద్వారా ఏటా పొదుపు సంఘాలకు రూ.283 కోట్లు మేరకు మేలు జరుగనుంది. అలాగే ప్రభుత్వంపై కూడా సున్నావడ్డీ కింద చెల్లిస్తున్న దానిలో రూ.150.14 కోట్ల భారం తగ్గుతోంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న వడ్డీరేట్లు అధికంగా వుండటం వల్ల వాటి చెల్లింపుల విషయంలో మహిళలకు ఆర్థికభారంగా మారిందని మంత్రి అన్నారు.

Also read:ఏపికి కేంద్రం నుండి మరో రూ.700 కోట్లు: మంత్రి పెద్దిరెడ్డి

దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించి, ఈ భారంను సాధ్యమైనంత వరకు తగ్గించాలంటూ బ్యాంకర్లపై అనేక సార్లు వత్తిడి తెచ్చారని అన్నారు. దీనిలో భాగంగానే 207, 208, 209, 210 ఎస్ఎల్బిసి సమావేశాల్లో జగన్ పొదుపుసంఘాల నుంచి వసూలు చేస్తున్న వడ్డీరేట్ల పై బ్యాంకర్లతో ప్రధానంగా చర్చించారని పెద్దిరెడ్డి వెల్లడించారు.

పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు బ్యాంకులు తాము వసూలు చేస్తున్న వడ్డీరేట్లను తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారని మంత్రి తెలిపారు.  ఇదే అంశంపై గత ఏడాది జూలై 4వ తేదీన పిఆర్ అండ్ ఆర్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన బ్యాంకులతో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశంలోనూ పొదుపుసంఘాల వడ్డీరేట్ల తగ్గింపుపై చర్చించారని రామచంద్రారెడ్డి  గుర్తుచేశారు.

అలాగే ఈ ఏడాది మార్చి నాలుగో తేదీన సచివాలయంలో ఫైనాన్స్ (ఐఎఫ్‌) స్పెషల్ సెక్రటరీ అధ్యక్షతన బ్యాంకర్లతో జరిగిన ప్రత్యేక సబ్ కమిటీ సమావేశం జరిగిందన్నారు.

ఈ భేటీలో వడ్డీరేట్ల తగ్గింపు, పొదుపుసంఘాల సభ్యులు తమ సేవింగ్స్ ఖాతాల నుంచి పొదుపు మొత్తాలను ఎటువంటి అభ్యంతరాలు లేకుండా విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకర్లు వీలు కల్పించాలనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందని పెద్దిరెడ్డి వివరించారు.

Also Read;గుడ్‌న్యూస్: జూన్ 11 నుండి భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం

బ్యాంకులతో ప్రభుత్వం జరుపుతున్న నిరంతర చర్చల కారణంగా ఆప్కాబ్ బాటలోనే పలు బ్యాంక్ లు తక్కువ వడ్డీరేట్లకే తాము కూడా రుణాలు అందిస్తామంటూ ముందుకు వచ్చాయని రామచంద్రారెడ్డి ప్రకటించారు. 

బ్యాంకుల వారీగా సవరించిన వడ్డీరేట్లు:

గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు సంఘాల రుణాలపై 12.50 శాతం వడ్డీరేటును వసూలు చేసేదని, ప్రస్తుతం దానిని 9.25 శాతంకు తగ్గించిందని మంత్రి తెలిపారు.

ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకులను విలీనం చేసుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో 12.50 శాతం వడ్డీరేటు వసూలు చేయగా ప్రస్తుతం దానిని 8.10 శాతం నుంచి 9.60 శాతం వరకు తీసుకున్న రుణాలు, అడ్వాన్స్ లను బట్టి వసూలు చేస్తోందని తెలిపారు.

అలాగే ఆప్కాబ్ కూడా 12.50 శాతం నుంచి 10శాతంకు వడ్డీరేట్ ను తగ్గించిందని పెద్దిరెడ్డి వివరించారు. సిండికేట్ బ్యాంక్ తో  విలీనమైన కెనరా బ్యాంక్ కూడా 9.15 నుంచి 9.40 వరకు రుణాలు, అడ్వాన్స్ లపై వడ్డీరేట్ ను తగ్గించిందని మంత్రి పేర్కొన్నారు. బ్యాంకులు సైతం వడ్డీరేట్లు తగ్గించడం వల్ల పొదుపు సంఘాలకు మరింత మేలు జరుగుతోందని రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios