అమరావతిలో  ఆర్ 5  జోన్ లో  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ  పేదలకు  ఇళ్ల స్థలాలను  పంపిణీ  చేశారు. ఇటీవలనే  సుప్రీంకోర్టులో   ఇళ్ల స్థలాల  పంపిణీకి   గ్రీన్ సిగ్నల్  ఇవ్వడంతో    రాష్ర ప్రభుత్వం  పట్టాలు  పంపిణీ చేసింది

అమరావతి: నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కానీ నారా చంద్రబాబునాయుడిని నమ్మలేమని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు. .అమరావతి ఆర్ 5 జోన్ లో పేదలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు.2014లో 600 పేజీలతో ఎన్నికల మేనిఫెస్టో ను చంద్రబాబు విడుదల చేశారన్నారు. కానీ ఈ మేనిఫెస్టేలోని అంశాలను అమలు చేయలేదన్నారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98.5 శాతం అమలు చేశామన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అనే రీతిలో సాగిందని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల కోసం గజదొంగల ముఠా ఏకమౌతుందని టీడీపీ సహ విపక్షాలపై జగన్ విమర్శలు గుప్పించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలను చంద్రబాబు ఇస్తారని సీఎం చెప్పారు. మోసం చేసే చంద్రబాబును నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు సూచించారు.2014 నుండి 2019 వరకు చంద్రబాబునాయుడు ఒక్క ఇళ్ల పట్టా ఇవ్వలేదని ఆయన గర్తు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో అమరావతి ఇక మీదట సామాజిక అమరావతి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు లేకుండా ఎన్నో కుట్రలు చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా ఎన్నో కుట్రలు చేశారన్నారు. పేదల కు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించినట్టుగా సీఎం గుర్తు చేశారు. మొత్తం 25 లేఔట్లలో ఇళ్ల పట్టాలను అందిస్తున్నామన్నారు. రూ. 16 నుండి రూ. 20 లక్షల విలువ చేసే ఇంటి స్థలాలు పేదలకు అందిస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు.ఇళ్ల నిర్మాణానికి పావలా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు.

ఈ ఏడాది జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి రోజున ఈ ఇళ్ల స్థలల్లో ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మూడు పద్దతుల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతామన్నారు. 52 వేల టిడ్కో ఇళ్లు కూడా ఇదే రోజున పేదలకు అందిస్తున్నామని సీఎం చెప్పారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో 5024 టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైా ఇలాంటి ఆలోచనలు చేశారా అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.