వైసీపీ పటిష్టతపై ఫోకస్.. జగన్ కీలక నిర్ణయం, 175 నియోజకవర్గాలకు త్వరలో పరిశీలకులు
వచ్చే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాలని నిర్ణయించారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిపాదిత అబ్జర్వర్ల జాబితాను జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్లు సిద్ధం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది వైసీపీ అధిష్టానం. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయించింది. పరిశీలకుల జాబితాపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్కు అదనంగా అబ్జర్వర్ను నియమించాలని జగన్ భావిస్తున్నారు. నియోజకవర్గ నేతలకు, పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు అబ్జర్వర్లు. అంతేకాదు నియోజవర్గ అంశాలను హైకమాండ్కు నివేదించనున్నారు. ప్రతిపాదిత అబ్జర్వర్ల జాబితాను జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్లు సిద్ధం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదించిన తర్వాత 175 నియోజకవర్గాలకు తుది జాబితాను ప్రకటించనున్నారు.