తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టలేదు, పెట్టం: జలవివాదంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కృష్ణానదీ జల వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తమకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఎవరి వాటా ఎంత అన్న దానిపై కేటాయింపులు జరిగాయని జగన్ గుర్తుచేశారు.
తెలంగాణ, కోస్తా, రాయలసీమ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న జగన్.. ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి కేటాయింపులు జరుపుకున్నాయన్నారు. 881 అడుగుల నీటిమట్టం వుంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావన్నారు. 2015 జూన్లో నీటి కేటాయింపులు జరిగాయన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని జగన్ ఆరోపించారు. తెలంగాణ మంత్రులు కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ 881 అడుగుల లోపే వాడుకుంటున్నారని సీఎం ఆరోపించారు.
Also Read:ఏపీతో తాడోపేడో:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై సుప్రీంకి కేసీఆర్ సర్కార్
రాయలసీమ పరిస్ధితి మీకు తెలియదా అని జగన్ ఎద్దేవా చేశారు. మాకు కేటాయించిన నీటిని మేం తీసుకుంటే తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు. రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు నీటిని కేటాయించారని సీఎం గుర్తుచేశారు. రెండు ప్రాంతాల్లో ప్రజలు సంతోషంగా వుండాలని కోరారు. అందుకే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రాజకీయాల్లోకి జగన్ వేలు పెట్టలేదని.. ఇకపై కూడా పెట్టడని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యత వుండాలని జగన్ ఆకాంక్షించారు.