ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జగన్ ఈ మేరకు తెలియజేశారు. 


ఏపీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా (har ghar tiranga) కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌పై ( Azadi Ka Amrit Mahotsav) కేంద్రం ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ (ys jagan) మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగస్ట్ 13 నుంచి 15 వరకు నిర్వహిస్తామని తెలిపారు. దీనిలో భాగంగా ఏపీ వ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తామని సీఎం వెల్లడించారు. 

ALso REad:మూఢ నమ్మకాలను ఎదురించి.. భారత పునరుజ్జీవన పితామహుడిగా నిలిచిన రాజా రామ్మోహన్ రాయ్..

ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని జగన్ చెప్పారు. దీనిపై ప్రచారం కూడా నిర్వహించామని.. సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు అన్నింటిపైనా జాతీయ పతకాలను ఎగురువేసేలా ప్రచారం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు, 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నామని సీఎం చెప్పారు. 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేస్తారని జగన్ అన్నారు. 

మరోవైపు.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్ కార్య‌క్ర‌మం నేపథ్యంలో కర్ణాటకలో వివాదం నెలకొంది. కొంత మంది విద్యార్థుల‌తో ఉత్తరాఖండ్ టూర్ నిర్వ‌హించాలని నిర్ణయించారు. అయితే ఈ టూర్‌కు హిందీ మాట్లాడగ‌లిగే విద్యార్థుల‌ను ఎంపిక చేయాల‌ని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(బెంగళూరు సౌత్‌) డిప్యూటీ డైరెక్టర్ జారీ చేసి సర్క్యులర్‌ వివాదాస్పదంగా మారింది. 

అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వం లేదా కేంద్రప్ర‌భుత్వంతో ఎటువంటి సంబంధం లేద‌ని అధికారులు తెలిపారు. వైరల్‌గా మారిన సర్క్యులర్‌లో.. "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన‌ విద్యార్థుల‌తో ఉత్తరాఖండ్ టూర్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా.. ప్ర‌తి క‌ళాశాల నుంచి ఇద్ద‌రూ విద్యార్థుల‌ను ఎంపిక చేస్తారు. వీరిని ప్రీ-యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్‌లోని బెంగుళూరు సౌత్ జిల్లా నుండి ఎంపిక చేస్తుంది. అయితే.. హిందీ మాట్లాడగలవారు, సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక, క్రీడా కార్యకలాపాలపై ఆసక్తి ఉన్నవారిని సెల‌క్ట్ చేసి.. ఆ విద్యార్థుల జాబితాను డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి పంపించాల‌ని సర్క్యులర్‌లో కళాశాలలను ఆదేశించింది. విద్యార్థుల తుది ఎంపికను డిప్యూటీ డైరెక్టర్ చేస్తారు.

ఈ క్ర‌మంలో హిందీ మాట్లాడ‌గ‌లిగే వారు అని సెల‌క్ట్ చేయాలని ఆదేశించ‌డం పై తీవ్ర దూమారం రేగింది. ఈ సర్క్యులర్‌పై కన్నడ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ టీఎస్‌ నాగభరణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాశారు. అయితే, కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ అటువంటి సూచనలు చేయలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ బుధవారం పేర్కొన్నారు.