జగన్ మంత్రివర్గ విస్తరణ: అవకాశం వీరికే, కారణాలివే...
ఈ మంత్రివర్గ విస్తరణ కోసం ఇప్పటికే రాజ్ భవన్ కి సమాచారం కూడా అందించారట. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు విస్తరణ జరగనున్నట్టుగా తెలియవస్తుంది. జగన్ అధికారం చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఎన్నెన్నో ఊహాగానాలు వినబడుతున్నాయి. మోపిదేవి, పిల్లిలు ఇద్దరి రాజీనామాలను నిన్న ఆమోదించడంతో ప్రస్తుతానికి ఆ శాఖలు రెండు జగన్ వద్దే ఉన్నాయి. నేటితో శ్రావణ మాసం మొదలవడంతో రేపు మంత్రివర్గ విస్తరణ ఉండే ఆస్కారం ఉంది.
ఈ మంత్రివర్గ విస్తరణ కోసం ఇప్పటికే రాజ్ భవన్ కి సమాచారం కూడా అందించారట. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు విస్తరణ జరగనున్నట్టుగా తెలియవస్తుంది. జగన్ అధికారం చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే!
ఇక మంత్రివర్గంలోకి ఎవఱినీ తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఘడియ గడియకు సమీకరణాలను చూసుకోవడం వాటిని సమీక్షించడం అన్ని జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకసారి వినబడ్డ పేరు మరల వినబడడంలేదు, రేసులో లేనిపేరు అనూహ్యంగా ముందుకు వస్తుంది.
బోస్ ను గనుక తీసుకుంటే... ఆయన మంత్రిగా సేవలందించడంతోపాటుగా ఆయన ఉపముఖ్యమంత్రి కూడా. ఒకవేళ మంత్రిగా ఎవరినైనా తీసుకున్నప్పటికీ... వారిని నేరుగా ఉపముఖ్యమంత్రిపదవిలో కూర్చోబెట్టలేరు. ఇతర సీనియర్ బీసీ నేతలు చాలా మంది ఉన్నారు.
మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా, పిల్లి శెట్టిబలిజ సామజిక వర్గానికి చెందినవారు. తొలుత మత్స్యకార వర్గం నుంచి నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ను అనుకున్నప్పటికీ.... ఆ సామాజికవర్గానికి ఆ ప్రాంతంలో కన్నా ఉత్తరాంధ్రలో ఇవ్వడం కరెక్ట్ అని జగన్ భావించారు.
ఉత్తరాంధ్రలో ఇప్పటికే బొత్స, ధర్మాన ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ అక్కడ రాజకీయ సమీకరణాల దృష్ట్యా పలాస ఎమ్మెల్యే అప్పలరాజుకు అమాత్య పదవిని కట్టబెట్టనున్నట్టు తెలియవస్తుంది.
అదే విధంగా బోస్ సామాజిక వర్గాన్నీ అదే సామాజికవర్గంతో నింపాలని ప్రయత్నించినప్పుడు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు వినబడ్డప్పటికీ.... తూర్పు గోదావరి జిల్లారాజకీయ సమీకరణాల దృష్ట్యా రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణకె అమాత్య పదవి దక్కినట్టుగా సమాచారం.
ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తమ్మినేని, జోగి రమేష్ సహా ఇతర మంత్రి పదవులు ఆశించిన వారికి నిరాశే ఎదురయింది. డిప్యూటీ సీఎం గా ధర్మాన కృష్ణ దాసును ప్రమోట్ చేసే ఆస్కారం ఉన్నట్టు చెబుతున్నారు. ధర్మానకు ఉప ముఖ్యమంత్రిపదవితోపాటు పిల్లి నిర్వర్తించిన రెవిన్యూ శాఖను కూడా అప్పగించాలని భావిస్తున్నారు.