కృష్ణానది కరకట్ట వాసులకు సీఎం జగన్ ఉగాది ఆఫర్
వివాదాలకు కేంద్రబిందువుగా మారిన కృష్ణా నది కరకట్టపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నది కరకట్టపైనా, లోపల నివసిస్తున్న నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాదాలకు కేంద్రబిందువుగా మారిన కృష్ణా నది కరకట్టపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నది కరకట్టపైనా, లోపల నివసిస్తున్న నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.
మున్సిపల్ అధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నది కరకట్టపైనా లోపల ఉన్న పేదల వివరాలు అందజేయాలని ఉగాది లోపు వారందరికీ ఇళ్లు అందిచే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెండు సెంట్లలో మంచి డిజైన్ లో ఇళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
నదీ ప్రవాహానికి అడ్డుగా ఉండటంతోపాటు వరద ముంపు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని అక్కడ నుంచి తొలగించి శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఉచితంగా ఉగాది నాటికి బెజవాడలో ఇళ్లు నిర్మించి వారికి అప్పగించాలని జగన్ ఆదేశించారు.
ఇటీవలే బెజవాడలోని నిరుపేదలకు లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు రెండు దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.