ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీగా వున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ పోస్టులతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీగా వున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అలాగే మహిళా శిశుసంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
అంగన్వాడీలలో నాడు – నేడు పనులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్ స్కూళ్లుగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన సుమారు 45వేల అంగన్వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు.
అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలని... తద్వారా ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను (గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్) కూడా అంగన్వాడీల్లో ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Read More జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం... కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలన్న సీఎం సూచించారు. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలని అధికారులకు సీఎం సూచించారు. క్రమం తప్పకుండా అంగన్వాడీలపై పర్యవేక్షణ జరగాలన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపై కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
సీఎం జగన్ చేపట్టిన ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కె.వి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కే.వీ.వీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండియన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీతతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
