బాబుకు ప్రతికూల దశ...లోకేశ్ జాతకబలమే ప్రభుత్వాన్ని నడుపుతోంది: జ్యోతిష్యులు
ముహూర్తం బాగొకపోతే అడుగు తీసి అడుగు కూడా పెట్టరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ నేతలకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి బాగా పట్టుకుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లిన చంద్రబాబు రాష్ట్రవిభజన తర్వాత వీటికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారు
ముహూర్తం బాగొకపోతే అడుగు తీసి అడుగు కూడా పెట్టరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ నేతలకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి బాగా పట్టుకుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లిన చంద్రబాబు రాష్ట్రవిభజన తర్వాత వీటికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన జాతకంతో పాటు కుమారుడు లోకేశ్ జాతకాన్ని కూడా ప్రముఖ జ్యోతిష్యులకు చూపించి ఎప్పటికప్పుడు పరిహారాలను చేయిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న గ్రహగతులను అనుసరించి ముఖ్యమంత్రి చంద్రబాబు జాతకం బాగోలేదట.
కానీ నారా లోకేశ్ జాతకం అద్భుతంగా ఉందట.. అందువల్లే ఏపీ ప్రభుత్వం సజావుగా నడుస్తోందని ప్రముఖ హస్తసాముద్రిక నిపుణులు, జ్యోతిష్యులు మాండ్రు నారాయణ రమణారావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయం ప్రదేశం బాగానే ఉన్నా.. ఈ ప్రాంతంలో అన్ని నెగిటివ్ వైబ్రెషన్స్ ఉన్నాయన్నారు.
దీనివల్ల సెక్రటేరియేట్లో పనిచేసే చిన్న ఉద్యోగి నుంచి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏపీ సచివాలయంలో మార్పులు చేస్తే, చంద్రబాబుకు రాజకీయంగా , ఆరోగ్యపరంగా బాగుంటుందని రమణారావు తెలిపారు.
సీఎం చంద్రబాబును తాను ఇటీవలి కాలంలో చూడలేదని.. చూసిన తర్వాత 2019లో పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతానన్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో జగన్ను చూశానని... రోజు రోజుకు మెరుగుపడుతున్నారని అన్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతకంలో గ్రహగతులు అద్భుతంగా ఉన్నాయన్నారు. కొన్ని దైవిక క్రియలు చేస్తే భవిష్యత్తులో సునాయాసంగా ప్రధాని అవుతారన్నారు. 2019లో కేసీఆర్ పట్టిందల్లా బంగారం అవుతుందన్నారు. మరోవైపు నారా లోకేశ్ కంటే మంత్రి కేటీఆర్ జాతకం బాగుందని నారాయణ రావు వెల్లడించారు.
కేసీఆర్ రెండో సారి సీఎం అవుతారని తాను రెండు నెలల క్రితమే చెప్పానని గుర్తు చేశారు. పార్లమెంట్ భవనంలో, మోడీ పేషీలో కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తున్నాయని... కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేస్తే మోడీ మళ్లీ ప్రధాని అవుతారని చెప్పారు.. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే యోగం ఉందని.. అయితే అది 2019లో కాదని అన్నారు.