నాకు చెప్పకుండా కమిటీ వేస్తారా: సీఎస్ పై చంద్రబాబు ఫైర్
టీటీడీ వివాదంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తనకు చెప్పకుండా కమిటీ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు.. అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారని నిలదీశారు. సీఎస్ కమిటీ వేసి రాటిఫికేషన్ కోసం తనకు పంపుతారా అంటూ విరుచుకుపడ్డారు.
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరుగుతున్నారు. సీఎస్ గా ఎల్వీసుబ్రహ్మణ్యంను కేంద్ర ఎన్నికల సంఘం నియమించినప్పటి నుంచి గుర్రుగా ఉన్న చంద్రబాబు ఏదో ఒక సాకుతో తిట్టిపోస్తున్నారు.
తాజాగా బుధవారం మరోసారి సీఎస్ పై విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం నగలు తరలింపు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ వివాదంలో రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరు సరికాదంటూ మండిపడ్డారు. టీటీడీ వివాదంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తనకు చెప్పకుండా కమిటీ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు.. అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారని నిలదీశారు. సీఎస్ కమిటీ వేసి రాటిఫికేషన్ కోసం తనకు పంపుతారా అంటూ విరుచుకుపడ్డారు. కమిటీ వేసేటప్పుడు మాత్రం గుర్తుకురాని సీఎం రాటిఫికేషన్ చెయ్యడానికి మాత్రం గుర్తుకు వచ్చానా అంటూ ప్రశ్నించారు.
రాటిఫికేషన్ చేయడానికే తాను ఉన్నానా? అంటూ నిప్పులు చెరిగారు. టీటీడీ విషయంలో తప్పు చేయని ఈవోను సీఎస్ ఎలా తప్పు పడతారంటూ చంద్రబాబు నాయుడు నిలదీశారు. మెుత్తానికి సీఎం, సీఎస్ ల మధ్య నెలకొన్న విబేధాలు రోజురోజుకు తీవ్రమవుతుండటంతో పాలనపై సందేహాలు నెలకొంటున్నాయి.