ఉద్యోగుల పేర్లతో భూములు, రాజధాని అలైన్మెంట్ మార్పు : నారాయణ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. సీఐడీ చేతికి ఆధారాలు
అమరావతి భూముల కొనుగోలు కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు సీఐడీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.
అమరావతి భూముల కొనుగోలు కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ , ఆయన కుమార్తెలు శరాని, సింధూర ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లిలలో తనిఖీలు జరుగుతున్నాయి. గతంలో మాదాపూర్లో వున్న నారాయణ కార్యాలయంలో తొలుత సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. తాజాగా కొండాపూర్లోని కోలా లగ్జరియా, గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్, కూకట్పల్లిలోని లోధా టవర్స్లోని ఆయన కుమార్తెల నివాసాల్లో సోదాలు చేపట్టారు. రాజధాని మాస్టర్ ప్లాన్లో నారాయణ కీలక పాత్ర వహించారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో 65 ఎకరాలు కొన్నారు నారాయణ.
అలాగే నారాయణ సంస్థ ఉద్యోగుల పేరు మీదా ఆయన భూములు కొన్నట్లుగా సీఐడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పొట్లూరి ప్రమీల, ఆవుల మునిశంకర్, రాపూర్ సాంబశివరావుల ఖాతాల్లోకి భారీగా నగదు జమ చేసినట్లుగా సీఐడీ గుర్తించింది. 2017 జూన్, జూలై , ఆగస్ట్ మధ్య ఈ కొనుగోలు వ్యవహారం నడిచినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 148 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేయడంతో పాటు తమ వారికి లబ్ధి చేకూర్చేలా అమరావతి మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్ డిజైన్ను మార్చినట్లుగా నారాయణపై సీఐడీ ఆరోపణలు గుప్పిస్తోంది. నారాయణ ఎడ్యుకేషన్ సోసైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రామనారాయణ ట్రస్ట్ ద్వారా 17.5 కోట్ల నగదు బదిలీ చేసినట్లుగా సీఐడీ చెబుతోంది.
ALso REad: అమరావతి భూముల కేసు : మాజీ మంత్రి నారాయణకు ఊరట.. తొందరపాటు చర్యలొద్దు , సీఐడీకి హైకోర్ట్ ఆదేశం
కాగా.. అమరావతి ప్రాంతంలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో నారాయణపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీఐడీ వర్గాల ప్రకారం.. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, మరికొందరు మంత్రులు, వారి బినామీలు.. ఆ భూములకు సంబంధించి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ పథకం కింద ప్రభుత్వం తీసుకుంటుందనే భయం నెలకొలిపి కాజేశారు. ఆ తర్వాత వారి నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. అనంతరం మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్పూలింగ్ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2016లో జీఓ 41 జారీ చేయాలని మంత్రులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు.