ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ అధికారులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసులో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోని నారాయణ, ఆయన కుమార్తెలు, బంధువుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ అధికారులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్టు చేశాయి. సోదాల సమయంలో సీఐడీ అధికారులు ఓ ఆడియో క్లిప్ స్వాధీనం చేసుకున్నారని.. అందులో నారాయణకు, ఆయన కుమార్తెకు మధ్య జరిగిన సంభాషణ ఉన్నట్టుగా చెబుతున్నారు.
మనీ రూటింగ్ ఎలా చేయాలనే దానిపై నారాయణకు, ఆయన కుమార్తెకు జరిగిన సంభాషణ ఆడియో క్లిప్లో ఉందని తెలుస్తోంది. నారాయణ చెప్పినట్టుగానే అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టుగా సీఐడీ అధికారులు సమాచారాన్ని సేకరించినట్టుగా సమాచారం.
ఇక, అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా, రాజధాని ప్రాంతంలోని గ్రామాల నుంచి ఎస్సీ, ఎస్టీలు, బీసీల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై పలు కేసులు నమోదయ్యాయి.
ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ హోదాలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో మాజీ మంత్రి నారాయణ హస్తం ఉన్నట్లు ఏపీ సీఐడీ చెబుతోంది. రాజధాని ప్రాంతంలో వివిధ రూపాల్లో అక్కడ నారాయణ భూములు కొనుగోలు చేసినట్టుగా గుర్తించినట్టుగా పేర్కొంది. తనకు బినామీలుగా ఉన్న ప్రమీల, శంకర్, సాంబశివరావు పేర్లతో భూములు కొనుగోలు చేసే ముందు వారి ఖాతాల్లోకి నిధులు బదిలీ చేసి పెద్దమొత్తంలో డిపాజిట్లు చేసినట్టుగా గుర్తించినట్టుగా చెబుతోంది. తనతో పాటు పలు సంస్థలకు లబ్ది చేకూర్చేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను నారాయణ మార్చినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
ఇందుకు సంబంధించి తాజా సోదాల సందర్భంగా.. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు స్టేట్మెంట్లను సేకరించి లావాదేవీలపై ఆరా తీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఓపెన్ ప్లాట్ల కొనుగోలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీలపై సీఐడీ బృందాలు దృష్టి సారించాయి.
