చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కస్టడీ పిటిషన్ వేసిన సీఐడీ
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఐడీ మరో షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయనను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో చోటు చేసుకున్న అక్రమాలపై 2022లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేతను ఏ1గా చేర్చారు పోలీసులు.
ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్లో సీఐడీ కేసు నమోదు చేసింది.
Also Read: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 26కు వాయిదా
చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నారా లోకేష్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కె హౌసింగ్ లిమిటెడ్కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్లతో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్), సీడ్ క్యాపిటల్ల అలైన్మెంట్లను ఉద్దేశపూర్వకంగా, గణించిన పద్ధతిలో నారాయణ గ్రూప్ సంస్థలకు అనవసరమైన సంపదను అందించేందుకు చంద్రబాబు నాయుడు, నారాయణ కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.