కర్ణాటకలో లోయపడ్డ ఏపీ బస్సు, విద్యార్థి మృతి: జగన్ ఆరా
కర్ణాటకలో ఏపీకి చెందిన ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మరణించగా, నలుగురు గాయపడ్డారు. ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం: విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మరణించగా, నలుగురు గాయపడ్డారు. విహార యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు ప్రమాదానిక గురైంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు సమాచారం. శనివారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడగానే బస్సు అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు.
అయితే, బాబా ఫక్రుద్దీన్ అనే విద్యార్థి మరణించినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు విహార యాత్రకు బయలుదేరారు. బస్సు శివమొగ్గకు వెళ్తుండగా ధార్వాడ్ వద్ద బోల్తా పడింది.
వైఎస్ జగన్ ఆరా
కర్ణాటకలోని ఉడిపి వద్ద అనంతపురం జిల్లా కదిరి స్కూల్బస్సుకు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ఆయనకు తెలిపారు.
తక్షణమే సహాయ కార్యక్రమాలు అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.