AP Budget 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్ట‌నున్నారు. ఈ నేప‌థ్య‌లో అంత‌కు ముందే రాష్ట్ర క్యాబినెట్ శుక్రవారం ఉదయం సమావేశం కానుంది.  

Andhra Pradesh Budget 2022: శుక్ర‌వారం నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్ట‌నున్నారు. ఈ నేప‌థ్య‌లో అంత‌కు ముందే రాష్ట్ర క్యాబినెట్ స‌మావేశం కానుంది. శుక్ర‌వారం ఉదయం 9 గంట‌ల‌కు రాష్ట్ర క్యాబినెట్ స‌మావేశం కానుంద‌ని సీఎస్ సమీర్ శర్మ మీడియాకు వెళ్ల‌డించారు. ఈ స‌మావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంధ్ర‌నాథ్ ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. కేవ‌లం బ‌డ్జెట్ ఆమోదానికే ప‌రిమితం కాకుండా ఈ స‌మావేశాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చే కీల‌క అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత వ‌ర్గాలు విశ్వ‌స‌నీయ స‌మాచారం. 

ఇక సారి ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్ భారీగానే ఉంటుంద‌నీ, అధికంగా సంక్షేమ ప‌థ‌కాల‌కే కేటాయింపులు అధికంగా ఉంటాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇదిలావుండ‌గా, ఈ రోజు అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా తెలుగు దేశం పార్టీ నేత‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు న‌డుచుకున్న తీరును త‌ప్పుబ‌ట్టారు. అనుచిత ప్రవర్తనతో టీడీపీ సభ్యులు.. గవర్నర్‌ను అవమానించారని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌భ‌కు ఎందుకు రావ‌డం లేదో ఆయ‌న‌కే తెలియ‌డం లేదంటూ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు దిగ‌జారుడు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుందంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. 

ఎన్నిక‌లొచ్చిన‌ప్పుడ‌ల్లా హామీలు గుప్పించారు కానీ.. వాటికి ఏనాడు విలువ‌ను ఇవ్వ‌లేద‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. గవర్నర్ ను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సభ సభ్యులపై ఉంటుదని పేర్కొన్నముఖ్యమంత్రి.. తాము ప్రతిపక్షంలో ఉన్న‌ప్పుడు ఎప్పుడు కూడా ఇలా న‌డుచుకోలేద‌ని పేర్కొన్నారు. తాము చేస్తున్న ప‌నికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నార‌నీ, అందుకే రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌తి ఎన్నిక‌లో తాము విజ‌యం సాధిస్తున్నామ‌ని తెలిపారు. ‘‘ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీకే ప్రజలు పట్టం కట్టారు. 87 మున్సిపాలిటీలకు గానూ 84 గెలిచాం. 12 కార్పొరేషన్లనూ వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. స్థానిక ఎన్నికల్లో 98.6 శాతం వైఎస్సార్‌సీపీనే గెలిచిందని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.