ఉగ్రమూకకు ఎదురు నిలిచిన ఏపీ బాలికకు, కిలిమంజారో అధిరోహించిన హైదరాబాద్ బాలుడికి రాష్ట్రీయ బాల పురస్కారాలు..
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 29 మంది పిల్లలు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2022ను అందుకున్నారు .తెలంగాణ నుంచి క్రీడల విభాగంలో తేలుకుంట విరాట్ చంద్ర, శౌర్యం విభాగంలో ఏపీకి చెందిన గురుగు హిమప్రియ ఈ అవార్డును అందుకున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 29 మంది పిల్లలు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2022ను అందుకున్నారు. కొత్త ఆవిష్కరణ లు, క్రీడ లు, కళ లు, సంస్కృతి, సామాజిక సేవ, సాహసం వంటి పలు రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ప్రతీ ఏడాది ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కింద అవార్డులు అందిస్తారు. అవార్డులు అందుకన్నవారిలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 14 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నారు. రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న వారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తెలంగాణ నుంచి క్రీడల విభాగంలో తేలుకుంట విరాట్ చంద్ర, శౌర్యం విభాగంలో ఏపీకి చెందిన గురుగు హిమప్రియ ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ గా నిర్వహించారు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు (PMRBP)- 2022 పురస్కారాలను పొందిన పిల్లలతో ప్రధాన మంత్రి వర్చువల్ గా మాట్లాడారు. స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులకు (vocal for local) ప్రోత్సాహం అందించాలని పిల్లలను కోరారు.
ధైర్యసాహసాలతో గుర్తింపు పొందిన హిమ ప్రియ..
ధైర్యసాహసాలతో గుర్తింపు పొందిన గురుగు హిమ ప్రియ (Gurugu Hima Priya) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పొన్నం గ్రామం. ఆమెకు అవార్డుతోపాటు రూ.లక్ష చెక్కును అందజేశారు. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి హిమప్రియతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. హిమ ప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీలో విధులు నిర్వర్తించేవారు. ఉద్యోగరీత్యా 2018 సంవత్సరంలోసత్యనారాయణ జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్వార్టర్ లో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి 10 న వీరు నివాసముంటున్న క్వార్టర్స్లోని ఉగ్రవాదులు చొరబడ్డారు. అప్పుడు హిమ ప్రియ తండ్రి ఇంట్లో లేరు. హిమ ప్రియ తల్లి, ఇద్దరు సోదరరీమణులు మాత్రమే ఇంట్లో ఉన్నారు.
అయితే టెర్రరిస్ట్లు వాళ్ల ఇంట్లోకి ప్రవేశించకుండా హిమ ప్రియ తల్లి డోర్ను లాక్ చేశారు. దీంతో టెర్రరిస్టులు హ్యాండ్ గ్రనేడ్ విసిరారు. దీంతో హిమ ప్రియ తల్లి పద్మావతికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయినప్పటికీ హిమ ప్రియ ధైర్యంగా ముందడుగు వేసింది. తన తల్లిని, చెల్లెళ్లను కాపాడుకునేందుకు టెర్రరిస్టులతో మాట్లాడింది. తల్లిని ఎలాగైనా ఆస్పత్రికి తరలించాలనే భావించిన హిమ ప్రియ.. ఉగ్రవాదులపై ప్రశ్నల వర్షం కురిపించింది. చివరకు తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా వారిని ఒప్పించింది. హిమ ప్రియ తన తల్లి, సోదరిమణులతో సహా అక్కడి నుండి తప్పించుకోగలిగింది. ఆ తర్వాత భద్రతా దళాలు ప్రవేశించి ఉగ్రవాదులను హతమార్చాయి. దీంతో హిమ ప్రియ తన కుటుంబంతో పాటుగా, పలువురు తోటివారిని కాపాడగలిగింది.
చిన్న వయసులోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విరాట్ చంద్ర..
హైదరాబాద్కు చెందిన తేలుకుంట విరాట్ చంద్ర (Telukunta Virat Chandra) 2013 అక్టోబర్ 9న జన్మించాడు. అతి పిన్న వయసులో కిలిమంజారో (Kilimanjaro) పర్వతాన్ని అధిరోహించాడు. ఏడేళ్ల వయసులో (గతేడాది మార్చి 6న) కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుని 5,895 మీటర్ల ఎత్తులోని శిఖరం అంచుకు ఆరు రోజుల్లో చేరుకున్నాడు. ఇందుకోసం విరాట్ చంద్ర ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పొందాడు.
విరాట్ సాధించిన ఘనతకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత గొప్ప స్థాయికి చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. తన కజిన్స్ ఇలానే పర్వతారోహణ చేశారని, వాళ్ల నుంచి స్ఫూర్తి పొంది కిలిమంజారో ఎక్కాలని నిర్ణయించుకున్నానని విరాట్ చెప్పాడు. ఈ విషయం పేరెంట్స్కి చెప్పానని, వాళ్లు ఒప్పుకోవడంతో శిక్షణ తీసుకుని ఈ ఫీట్ సాధించానని అన్నాడు.