బీజేపీపై జనంలో నమ్మకం పెరుగుతోంది.. ఆత్మకూరు ఫలితాలే నిదర్శనం: విష్ణువర్థన్ రెడ్డి
ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ సాధించిన ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భవిష్యత్తులోనూ మరింత మెరుగ్గా పనిచేస్తామని ఆయన చెప్పారు.
ఆత్మకూరులో (atmakur bypoll) తమ అభ్యర్థి భరత్ కుమార్ ఓటమిపాలైనప్పటికీ, బీజేపీకి (bjp) పోలైన ఓటింగ్ శాతం పట్ల ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి (vishnuvardhan reddy) సంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 2019లో బీజేపీకి 2,314 ఓట్లు పోలయ్యాయని, అప్పట్లో 1.33 శాతం ప్రజలు తమకు మద్దతు పలికారని విష్ణు వివరించారు. 2022కి వచ్చేసరికి బీజేపీకి 19,332 ఓట్లు పడ్డాయని, తమకు మద్దతు పలికిన ప్రజల సంఖ్య 14.1 శాతానికి పెరిగిందని విష్ణువర్థన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఓటింగ్ శాతం పెరుగుదలే నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల్లో బీజేపీ పట్ల నమ్మకం పెరుగుతోందని .. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భవిష్యత్తులోనూ మరింత మెరుగ్గా పనిచేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
ALso Read:atmakur bypoll: టీడీపీ పోటీచేయకపోయినా.. కుట్రలు ఆగలేదు, మద్యాన్ని వదలడం లేదు: అంబటి
ఇకపోతే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో వైసీపీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కాగా.. తొలి రౌండ్ నుంచి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. పోస్టల్ బ్యాలెట్తో సహా 20 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన విక్రమ్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి భరత్ కుమార్ (బీజేపీ)పై 82, 888 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. మరికాసేపట్లో అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
విక్రమ్ రెడ్డికి 1,02,241 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్కు 19,353 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇక, నోటాకు 4,182 ఓట్లు పోల్ కావడం విశేషం. మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో ఆ టార్గెట్ను చేరుకోలేకపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆత్మకూరు ఉపఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతోనే విజయం సాధించినట్టుగా చెప్పారు. గౌతమ్ రెడ్డిపై అభిమానంతోనే భారీగా ఓట్లు వచ్చాయని తెలిపారు. ఈ విజయంతో తనపై బాధ్యత పెరిగిందన్నారు. ఓటమి వల్లే బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తుందని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చినందున.. గత సంప్రదాయాన్ని పాటించి ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ ప్రకటించింది.