Asianet News TeluguAsianet News Telugu

నవమాసాలు నిండినా నయాపైసా లేదు...మరో నెలరోజులే మీకు గడువు..: సీఎం జగన్ కు సోము వీర్రాజు హెచ్చరిక

ఏకగ్రీవ పంచాయితీలకు ప్రోత్సాహకాలు అందించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాసారు. 

AP BJP Chief Somu Veerraju  open letter to CM YS Jagan
Author
Amaravati, First Published Nov 28, 2021, 9:47 AM IST

అమరావతి: ఏకగ్రీవ పంచాయతీ పాలకమండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాసారు. పంచాయితీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవ పంచాయితీలకు భారీ ప్రోత్సాహకాలుంటాయని ప్రకటించారని... ఈ హామీ నెరవేర్చాలని somu veerraju డిమాండ్ చేసారు. జీవో విడుదల చేసి నవమాసాలు నిండిన అమలు చేయరా? అంటూ cm ys jagan ను బహిరంగ లేఖ ద్వారా నిలదీసారు.

సోము వీర్రాజు లేఖ యధావిధిగా: 
                 
వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్. 

విషయం.. ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకున్న గ్రామాలకు ప్రోత్సాహక నగదు విడుదల చేయాలి.

నవ మాసాలు నిండినా మీ ప్రోత్సాహకం అందలేదు...  మీరు ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు అందరూ ఏకమై ప్రోత్సాహకాలు కోసం ఏకగ్రీవం చేసి గ్రామసర్పంచ్ లను ఎన్నుకుని తొమ్మిది మాసాలు దాటినా ప్రోత్సాహకం అందలేదన్న విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా ముఖ్యమంత్రికి గుర్తుచేస్తున్నాను. రాష్ట్రంలోని 13,371 పంచాయితీలకుగాను పలు పంచాయితీలు నగర పంచాయితీలుగా మార్చడంతో పాటు ఇతర సమస్యలు కారణంగా 13,097 గ్రామపంచాయితీలకు ఫిబ్రవరి మాసంలో నాలుగుదశల్లో గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికలకు సంబంధించి  గ్రామపంచాయితీలు ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ జనవరి 26 వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేశారు. ఒక కాపీని సమాచార పౌరసంబందాల శాఖ కమీషనర్ కు అదేవిధంగా పంచాయితీరాజ్ శాఖ కు పంపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం 2 వేలు జనాభా ఉన్న గ్రామపంచాయితీ ఏకగ్రీవం అయితే ఐదు లక్షల ప్రోత్సాహకం, 2 వేలకు పైబడి 5 వేల వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయితీకి రూ.10 లక్షలు, 5 వేల నుండి 10 వేల వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయితీకి రూ.15 లక్షలు, 10 వేలు పైబడిన గ్రామ పంచాయితీకి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు ప్రోత్సాహకం ఇస్తామని ఉత్తర్వులలో మీ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇదే నిజమని నమ్మిన  గ్రామ పంచాయితీలలో ప్రజలు మహాత్మాగాంధీ  కలలుకన్న గ్రామ స్వరాజ్యం సిద్దిస్తుందని, గ్రామ పంచాయితీలు ఆర్ధిక పరిపుష్టం అవుతాయని 2,199  గ్రామ పంచాయితీలు ఏక గ్రీవం చేసుకుంటే కనీసం నయాపైసా ప్రోత్సాహకం అందించలేదు.

ముఖ్యమంత్రిగారూ... మీరు మాటతప్పను, మడమ తిప్పను అనే పదాన్ని తరుచుగా ఉచ్చరిస్తారు. అదే క్రమంలో మీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రోత్సహకాల  ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఈ బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. గ్రామాల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుంది. ఐతే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గమనిస్తే చిత్తశుద్ధి కరువయ్యిందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రోత్సాహకాల కోసం మీరు విడుదల చేసిన ఉత్తర్వులు  ఉత్తుత్తివి కాదని నిరూపించండి. మీరు గ్రామ పంచాయితీల అభివృద్దికి కట్టుబడి ఉన్నారని నమ్మకం రావాలంటే మీ ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయండి. 

బిజెపి రాష్ట్రశాఖ  ద్వారా నెల రోజులు గడువు ఇస్తోంది. ఈలోగా మీ ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించడానికి సమయంతో కూడిన కార్యచరణ  ఉండాలని ఈ  లేఖ ద్వారా  మీకు గుర్తు చేస్తున్నాను.  లేదంటే బిజెపి ఈ అంశంపై ఉద్యమబాట పడుతుంది. 

అదే విధంగా మీరు జిల్లాల్లోని ఆర్ధిక వ్యయమంతా కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టం పరిధిలోకి తీసుకురావడంవల్ల స్థానికసంస్థలు బలపడవు సరికదా బలహీనపడుతున్నాయి. అందువల్ల గ్రామపంచాయితీలకు నేరుగా నిధులు వెళ్లకుండా మీ  ప్రభుత్వం మోకాలొడ్డుతోంది. ఏ చిన్నపని జరిగినా, వాటికి నిధులు చెల్లింపు కష్టసాధ్యమౌతోంది. ఈ విధంగా స్థానికసంస్థల ఆర్ధికాధికారం మీ గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమైన విషయంగా మీకు గుర్తుచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు గ్రామ పంచాయితీలకు విడుదల చేస్తుంటే, రాష్ట్రప్రభుత్వం ఆ నిధులను నేరుగా పంచాయితీలకు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ ఈ లేఖ ద్వారా ఆక్షేపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం విధానాల కారణంగా గ్రామీణులకు నేరుగా అంతిమ ఫలాలు-ఫలితాలు అందటంలేదని బహిరంగ లేఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నాను.  

మీ విధానం కారణంగా గ్రామపంచాయితీల ఆర్ధిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతోంది. మీరు ప్రవేశపెట్టిన ఏకగవాక్ష విధానం నుండి స్థానికసంస్థల కార్యకలపాలను వేరుచేయాలని ఈ లేఖ ద్వారా  కోరుతున్నాను. ఏది ఏమైనా ఈ లేఖ ద్వారా ఒకటి స్పష్టం చేయదల్చుకున్నాను గ్రామపంచాయితీల ఆర్ధికవ్యవహారాల్లో రాష్ట్రప్రభుత్వం అడ్డుగోడగా వ్యవహరించడానికి వీలులేదు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించిన గ్రామపంచాయితీలకు ప్రోత్సాహకనిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను. ప్రోత్సహాకఉత్తర్వుల కోసం ఆయా గ్రామాల ప్రజలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్న సంగతి ముఖ్యమంత్రి  మరవకుండా ఉంటే మంచిదని లేఖ ద్వారా తెలియపరుస్తున్నాను.

ఇట్లు 
సోము వీర్రాజు,
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios