వినాయకచవితి పండుగపై ఆంక్షలు.. కర్నూలు కలెక్టర్ నివాసం ముట్టడి, సోము వీర్రాజు అరెస్ట్
వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు కర్నూలు కలెక్టర్ నివాసాన్ని ముట్టడించారు. పోలీసులు బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. అనంతరం సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.
ఏపీలో వినాయకచవితి వేడుకలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిల నేతృత్వంలో బీజేపీ శ్రేణులు నేడు కర్నూలులో ఆందోళన చేపట్టాయి. వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు కలెక్టర్ నివాసాన్ని ముట్టడించారు. పోలీసులు బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. అనంతరం సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.
Also Read:వినాయకచవితి పండుగపై ఆంక్షలా?: నిరవధిక దీక్ష చేస్తానంటున్న సోము వీర్రాజు
అంతకుముందు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వినాయకచవితి పండుగ విషయంలో ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా నిబంధనలు హిందూవుల పండుగలకేనా అని ఆయన ప్రశ్నించారు. ఇతర మతాల పండుగలకు ఈ ఆంక్షలు వర్తించవా అని సోమువీర్రాజు అడిగారు. వినాయక విగ్రహలు బయట ఏర్పాటు చేస్తే అరెస్ట్ చేస్తామని డీజీపీ ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. రంజాన్, క్రిస్మస్, మొహర్రం పండుగలపై లేని ఆంక్షలు వినాయకచవితికి ఎందుకని ఆయన ప్రశ్నించారు.