నా కరెంట్ బిల్లు మార్చిలో 11 వేలు వస్తే.. ఏప్రిల్లో 20 వేలు దాటింది: జగన్పై కన్నా వ్యాఖ్యలు
ప్రజలంతా ఇళ్లలో ఉన్న సమయంలో విద్యుత్ స్లాబులు మార్చడం దుర్మార్గమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
ప్రజలంతా ఇళ్లలో ఉన్న సమయంలో విద్యుత్ స్లాబులు మార్చడం దుర్మార్గమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. కరోనా వేళ విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్న ఆయన రెండు, మూడు రెట్లు అధికంగా బిల్లులు వస్తున్నాయని లక్ష్మీనారాయణ మండిపడ్డారు.
జగన్ సర్కార్కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. సహజంగానే ప్రజలు ఇళ్లలో ఉంటే విద్యుత్ వాడకం పెరుగుతుందని, కానీ గతంలో కంటే రెండు, మూడు రెట్లు అధికంగా బిల్లులు రావడం ఆమోదయోగ్యం కాదని కన్నా స్పష్టం చేశారు.
మార్చి నెలలో తాను రూ.11 వేల మేర విద్యుత్ బిల్లు చెల్లించానని, ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందని ఆయన వెల్లడించారు . ఇది విద్యుత్ చార్జీలు పెంచడం కాక మరేమిటి? అని కన్నా ప్రశ్నించారు. ఎంతో తెలివిగా విద్యుత్ స్లాబులు మార్చిన ప్రభుత్వం చార్జీలు మాత్రం పెంచలేదని చెబుతోందని లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.