ఎవరినీ ఎంటర్టైన్ చేయొద్దు: రెవిన్యూ అధికారులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
రెవిన్యూ అధికారులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం:రెవిన్యూ అధికారులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
శనివారం నాడు పొందూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయమై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన విషయాన్ని రెవిన్యూ అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన విషయం చెప్పడానికి మీరు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పోలీసుల సహాయంతోనైనా స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ఎవరు కబ్జాల్లో ఉన్నా కూడ ఉపేక్షించవద్దన్నారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాల్లో ఉన్నవారిని వెంటనే ఖాళీ చేయించాలని ఆయన సూచించారు.
ఎవరినీ కూడ ఎంటర్టైన్ చేయవద్దని ఆయన రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాల్లో ఉన్నవారితో అవసరమైతే తాను మాట్లాడుతానని ఆయన చెప్పారు.ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని స్పీకర్ హెచ్చరించారు.
ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్నవారిని వెంటనే తొలగించాలని తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు.