ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ పర్వం కొనసాగుతున్నది. ఈ రోజు కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు విధించారు. సభ జరగకుండా అడ్డుకుంటున్నారని స్పీకర్ ఆగ్రహిస్తూ ఈ చర్యలు టీడీపీ ఎమ్మెల్యేలు అందరిపై తీసుకున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సభ్యులు అందరినీ ఒక రోజు పాటు అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ సభ్యులు సభ సజావుగా జరగనివ్వడం లేదని, సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభ సజావుగా జరగడానికి సహకరించడం లేదని ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు సీరియస్ అయ్యారు. దీనికి ముందే.. టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ పై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసునూ స్పీకర్ తిరస్కరించారు.

కాగా, ఈ రోజు స్పీకర్ తమ్మినేని సభాలో అనుమతించని కొన్ని అంశాలను ప్రస్తావించారు. సమావేశాలను కొందరు సభ్యులు సెల్ ఫోన్లు చిత్రీకరిస్తున్నారని, వాటిని బయటి పత్రికా విలేకరులకు అందజేస్తున్నారని అన్నారు. దీనిపై తమకు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ఈ చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కాగా, అలా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారని, వారు కూడా సభలో చర్చను సెల్ ఫోన్‌లో తీస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దీనికి సమాధానంగా ఈ రూల్ వారికి కూడా వర్తిస్తుందని స్పీకర్ పేర్కొన్నారు. కాబట్టి, ఎవరు సెల్ ఫోన్లు తెచ్చినా దయచేసి స్వచ్ఛందంగా బయట పెట్టాలని కోరారు.

అలాగే, సభలో మొబైల్స్, పోస్టర్లు, ప్లకార్డులు, ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటే.. వారిని ఆటంకపరచాలని అనుచిత శబ్దాలు చేయడం, ఇతర రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టవద్దని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. రూల్ నెంబర్ 317లో ఈ అంశాన్ని చేర్చినట్టు వివరించారు.స్పీకర్ తెచ్చిన రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న కూడా నిరసనలు కొనసాగాయి. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు వారించినా వారు వినలేదు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మండిపడ్డారు. ఇలాంటి సభ్యులు ఉండటం తమ ఖర్మ అంటూ సీరియస్ అయ్యారు. సభను సజావుగా సాగనివ్వడం లేదని అన్నారు. మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ.. 11 మంది టీడీపీ సభ్యులను ఇవాళ ఒకరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశించారు.

టీడీపీ శాసన సభ్యులు అచ్చెన్నాయుడు, రామ్మో హన్ రావు, సాంబశివ రావు, అశోక్, భవానీ, సత్యప్రసాద్, చిన రాజప్ప, రామకృష్ణమనాయుడు, రవికుమార్, వెంకట నాయుడు, జోగేశ్వర రావులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలను ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే చర్చ చేయాలని ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలను స్పీకర్ తమ్మినేని సీతారాం వారించారు. దయచేసి సభ్యులు తమకు కేటాయించిన సీట్లల్లో కూర్చోవాలని పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. అయినా టీడీపీ సభ్యులు ఖాతరు చేయలేదు. దీంతో ఆయన టీడీపీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు.

టీడీపీ సభ్యులు ఏది అడిగితే అది చేయడానికి కాదు.. ఇక్కడ ప్రభుత్వం ఉన్నది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కనీసం ఫ్లోర్‌లో ఏం మాట్లాడాలో.. ఎలాంటి పదాలు వాడాలో కూడా తెలియదు అంటూ సీరియస్ అయ్యారు. మీరు శాసన సభ్యులుగా ఉండటం తమ ఖర్మ అంటూ ఫైర్ అయ్యారు. తాను కాబట్టే వారిని భరిస్తున్నానని, తనకు అనుభవం చేత టీడీపీ ఎమ్మెల్యేల తీరును భరిస్తున్నామని అన్నారు. ఇతరులైతే ఇది సాధ్యం కాకపోయి ఉండేదని తెలిపారు. అనంతరం, మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ద్వారా ఓటింగ్ జరిపి టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు.