అందుకే షర్మిల బాణం: పంచుమర్తి అనురాధ, తలసానిపైనా...
కేసీఆర్, జగన్ వదిలిన బాణం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని, అందుకే ఏపీకి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అనురాధ అన్నారు.
విజయవాడ: పింఛన్ల పెంపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ షర్మిల అనే బాణాన్ని వదిలారని తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల పోలీసులకు చేసిన ఫిర్యాదుపై ఆమె గురువారం మీడియా సమావేశంలో స్పందించారు.
వైసిపి తమ పార్టీ మహిళా శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదా అని ఆమె ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్ర పర్యటనపై, కేటీఆర్.. జగన్ ల భేటీపై కూడా ఆమె స్పందించారు.
కేసీఆర్, జగన్ వదిలిన బాణం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని, అందుకే ఏపీకి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అనురాధ అన్నారు. కేసీఆర్ చెంతకు చేరిన జగన్, తలసాని బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని, రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుని తలసాని ఏం ముఖం పెట్టుకుని బీసీల ద్రోహి అంటున్నారని ఆమె అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ బీసీలకు ద్రోహం చేస్తున్న విషయం తలసానికి కనిపించడం లేదా అని ఆమె అడిగారు. జగన్, కేసీఆర్ ఎపికి తాచుపాముల్లా తయారయ్యారని ఆమె అన్నారు. ఎపిలో బీసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. పోలవరంపై టీఆర్ఎస్ ఎంపి కవిత కేసు పెట్టిన విషయం నిజం కాదా అని అడిగారు.