మరో అల్పపీడనం... రానున్న నాలుగురోజులూ ఏపీలో భారీ వర్షాలు
రానున్న నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ రానున్న నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాబట్టి ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ముఖ్యంగా లంక గ్రామాలు, నదుల ఒడ్డునున్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తం వుండాలని సూచించారు.
వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీరంలో నెలకొన్న అల్పపీడనం ఇప్పటికీ స్థిరంగా ఉందని... దీనికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడి వుందని తెలిపారు. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇక ఈ నెల 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుందని... దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ సాధారణం నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.