Asianet News TeluguAsianet News Telugu

దేశరాజ‌ధాని ఢిల్లీలో అమ‌రావ‌తి రైతుల నిర‌స‌న‌లు.. !

Amaravati: మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మూడేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 17 నుంచి 19 వరకు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడమే కాకుండా, వారు వివిధ రాష్ట్రాల ఏంపీల‌ను కూడా కలుసుకుని తమ లక్ష్యానికి మద్దతు కోరనున్నారు.
 

Andhra Pradesh : Protests of Amaravati farmers in national capital Delhi
Author
First Published Dec 14, 2022, 4:59 AM IST

Amaravati farmers protest: అమ‌రావ‌తిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్న ఈ ప్రాంత రైతులు, స్థానికులు త‌మ నిర‌స‌న‌ల‌ను మ‌రోసారి దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి తీసుకెళ్తే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాష్ట్రాల రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఢిల్లీలో ఆందోళన దిగ‌నున్నారు. మూడు రాష్ట్రాల రాజధానులను అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17 నుంచి డిసెంబర్ 19 వరకు దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి మంగళవారం ప్రకటించింది.

గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అమరావతిని ఏకైక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు, ఇతర వర్గాల ప్రజలు సమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నారు. ఏపీఎస్‌ఎస్‌ అధ్యక్షులు శివారెడ్డి, కార్యదర్శి జీ తిరుపతిరావు నిరసన కార్యక్రమాలను ప్రకటించారు. నిరసనలో పాల్గొనేందుకు 1,800 మంది ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి బయలుదేరుతారని ఇరువురు తెలిపారు. డిసెంబరు 17న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామనీ,  డిసెంబరు 18న వివిధ రాష్ట్రాల ఎంపీలను కలుస్తామని తెలిపారు. తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని వారిని కోర‌నున్నట్టు పేర్కొన్నారు. మరుసటి రోజు, రైతుల వివిధ డిమాండ్లకు మద్దతుగా రాంలీలా గ్రౌండ్స్‌లో భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటార‌ని స‌మాచారం. 

కాగా, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతిని ఏకైక రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలనే గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని  వైఎస్సార్సీపీ స‌ర్కారు ఉప‌సంహ‌రించుకుంది. ఇదే స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ది కోస‌మే త‌మ నిర్ణ‌యమ‌ని పేర్కొంది.  అమరావతి, విశాఖపట్నం, కర్నూలు అనే మూడు రాష్ట్రాల రాజధానులను అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ స‌ర్కారు నిర్ణయించింది. అయితే, అమ‌రావ‌తి ప్ర‌జ‌లు, ప్ర‌తిపక్ష పార్టీ నాయ‌కులు ప్రభుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌భుత్వ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 

మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించ‌డంతో పాటు, అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని రైతులు నిర‌స‌న‌కు దిగారు. నిరసనలో భాగంగా అమరావతి రైతులు సెప్టెంబర్ 12న అమరావతి నుంచి అరసవల్లి వరకు మహా పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 12న అరసవల్లిలో ముగియాల్సి ఉండగా.. అక్టోబర్ 22న వైఎస్సార్సీపీ ప్రభుత్వం యాత్ర‌కు అడ్డంకులు సృష్టిస్తోంద‌నే ఆరోప‌ణ‌ల మ‌ధ్య  మార్గమధ్యంలో నిలిచిపోయింది. తమ డిమాండ్ల సాధనకు ప్రజా మద్దతు కూడగట్టేందుకు రైతులు గతేడాది అమరావతి నుంచి తిరుపతి వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు త‌మ నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌ని అమ‌రావ‌తి రైతులు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో అమరావతి రైతులు ఢిల్లీలో దీక్షకు దిగబోతుండటంపై ఆసక్తి నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios