అమ్మ ప్రేమంటే ఇదే.. తన పిల్లలను కాపాడమని తల్లి కుక్క ఆవేదన.. ఏపీ పోలీసుల సాయం..(వీడియో)
ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏది లేదనేది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా అమ్మ ప్రేమకు సాటిలేదనే చెప్పాలి.

ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏది లేదనేది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా అమ్మ ప్రేమకు సాటిలేదనే చెప్పాలి. తాజాగా వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ కుక్క తల్లడిల్లిపోయింది. అయితే చివరకు ఏపీ పోలీసుల సాయంతో తన పిల్లలను క్షేమంగా దక్కించుకోగలిగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. అయితే అందులో ఓ కుక్క పిల్లలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి.
అయితే ఆ కుక్కకు వాటిని కాపాడుకునేందుకు ఏ మార్గంలో వెళ్లాలనేది తెలియలేదు పాపం. కానీ కన్న ప్రేమతో.. ఏదో ఒక దారి కోసం వెతకసాగింది. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్న రెస్క్యూ బృందాలు చుట్టూ తిరగసాగింది. మూగ రోదనతో వారిని వెంబడించింది. అయితే కుక్క పదే పదే వెంబడించడంతో పోలీసులు అటుగా దృష్టిసారించారు. ఈ క్రమంలోనే కుక్క ఎందుకు ఇలా ఎందుకు చేస్తుందనే కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఆసక్తిగా కనబరిచారు.
ఈ క్రమంలోనే బాధలో ఉన్న కుక్క తీసుకెళ్లిన మార్గంలో వెళ్లారు. చివరకు నీటిలో మునిగిన ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఆ ఇంట్లో కుక్క యజమాని ఉండొచ్చని భావించారు. అయితే అక్కడ రెండు కుక్క పిల్లలు కనిపించాయి. దీంతో ఆ కుక్క ఎందుకోసం ఆవేదన చేదిందనేది పోలీసులకు కూడా అర్థమైంది. వెంటనే వాటిని కుక్క వద్దకు చేర్చారు. పోలీసులు కుక్కపిల్లలను శుభ్రమైన నీళ్లతో కడిగి తల్లి వద్ద వదిలేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
దీంతో కుక్క పిల్లలను కాపాడిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జంతువుల పట్ల విజయవాడ నగర పోలీసులు మానవత్వంతో వ్యవహరించినందుకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు.